INDvsAUS Final: వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు చేరిన టీమిండియా.. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగాల్సి ఉన్న తుదిపోరులో ఆస్ట్రేలియాతో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీలో టీమిండియా ఇక్కడిదాకా రావడానికి ప్రధాన కారణం జట్టు సారథి రోహిత్ శర్మే అంటున్నాడు ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్. ఆరంభంలో అదిరిపోయే ఆరంభాలను ఇవ్వడంతో పాటు జట్టును సారథిగా ముందుకు నడిపించడంలో హిట్మ్యాన్ సక్సెస్ అయ్యాడని వాన్ చెప్పుకొచ్చాడు. టెలిగ్రాఫ్కు రాసిన ఓ వ్యాసంలో వాన్.. రోహిత్పై ప్రశంసలు కురిపించాడు.
వాన్ తన వ్యాసంలో ‘ఈ ప్రపంచకప్లో నేనైతే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా రోహిత్నే ఎంపికచేస్తా. రోహిత్ లేకుంటే టీమిండియా ఇక్కడిదాకా వచ్చి ఉండేది కాదని నా నమ్మకం. ఆరంభంలో దూకుడుగా ఆడి తన తర్వాత వచ్చే బ్యాటర్లకు స్ఫూర్తినివ్వడమేగాకుండా సారథిగా ఫీల్డ్లో అతడి వ్యూహాలు అద్భుతం..’ అని కొనియాడాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ పది మ్యాచ్లు ఆడిన రోహిత్.. 550 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్ రేట్ 124.15గా ఉంది.
రోహిత్తో పాటు ఇటీవలే వన్డేలలో 50వ శతకాన్ని పూర్తిచేసిన విరాట్ కోహ్లీ, భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్లు భారత విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడాడు. ‘కోహ్లీ అత్యద్భుత ఫామ్లో ఉన్నాడు. వన్డేలలో 50 శతకాలు అంటే సాధారణ విషయం కాదు. అయ్యర్ కూడా భీకరమైన ఫామ్తో చెలరేగుతున్నాడు..’ అని పేర్కొన్నాడు. ప్రపంచకప్లో కోహ్లీ పది మ్యాచ్లలో 711 పరుగులు చేయగా అయ్యర్ 526 పరుగులు సాధించాడు.