INDvsAFG 3rd T20I: భారత్-అఫ్గానిస్తాన్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా టాపార్డర్ విఫలమైనా రోహిత్ శర్మ (69 బంతుల్లో 121 నాటౌట్,11 ఫోర్లు, 8 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన హిట్మ్యాన్.. ఆఖరి ఓవర్లలో తన మార్కు ఆట ఆడి శతకం బాదాడు. 64 బంతుల్లోనే సెంచరీ చేసిన హిట్మ్యాన్కు ఇది టీ20లలో ఐదో శతకం. రోహిత్కు తోడుగా నయా ఫినిషర్ రింకూ సింగ్ (39 బంతుల్లో 69 నాటౌట్, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) తోడవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్గాన్ పేసర్ ఫరీద్ అహ్మద్.. ఆరంభ ఓవర్లలోనే భారత్కు భారీ షాకులిచ్చాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు 20 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఓమర్జయ్ రాణించాడు.
వణికించిన ఫరీద్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు ఫరీద్ అహ్మద్ మూడో ఓవర్లోనే బ్యాక్ టు బ్యాక్ షాకులిచ్చాడు. అతడు వేసిన మూడో ఓవర్ మూడో బంతికి యశస్వి జైస్వాల్ (4) భారీ షాట్ ఆడబోయి నబీ చేతికి చిక్కాడు. ఆ మరుసటి బంతికే కోహ్లీ సైతం మిడాఫ్లో ఉన్న ఇబ్రహీం జద్రాన్కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. అజ్మతుల్లా వేసిన నాలుగో ఓవర్లో భారత్కు మరో షాక్ తాకింది. ఆ ఓవర్ చివరి బంతికి .. శివమ్ దూబే (1) వికెట్ కీపర్ గుర్బాజ్ సూపర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఎప్పుడో గానీ తుది జట్టులో ఆడే అవకాశం రాని సంజూ శాంసన్ (0) కూడా నిరాశపరిచాడు. ఫరీద్ వేసిన ఐదో ఓవర్లో శాంసన్.. నబీకి క్యాచ్ ఇచ్చాడు.
నిలబెట్టిన రోహిత్ – రింకూ..
ఐదు ఓవర్లలో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, రింకూ సింగ్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్కు 90 బంతుల్లో 195 పరుగులు జోడించారు. ఆరంభంలో తడబడ్డ రోహిత్.. భారత్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడాడు. స్పిన్నర్ మహ్మద్ సలీం వేసిన 8వ ఓవర్లో రింకూ తో పాటు రోహిత్లు తలా ఓ సిక్సర్ బాదారు. ఖాయిస్ అహ్మద్ వేసిన 9వ ఓవర్లో మూడో బంతికి ఎల్బీ నుంచి రింకూ తప్పించుకున్నాడు. 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేసింది.
గేర్ మార్చిన హిట్మ్యాన్..
స్కోరు మరీ తక్కువగా ఉండటంతో రోహిత్ గేర్ మార్చాడు. షర్ఫుద్దీన్ వేసిన 12వ ఓవర్లో హిట్మ్యాన్ బ్యాక్టుబ్యాక్ సిక్సర్లు బాదాడు. ఖాయిస్ అహ్మద్ వేసిన 13వ ఓవర్లోనూ రెండు బౌండరీలు సాధించాడు. ఆఖరి బంతికి ఫోర్ కొట్టడంతో రోహిత్ అర్థ సెంచరీ (41 బంతుల్లో) పూర్తయింది. ఈ ఓవర్లో రింకూ కూడా సిక్సర్ కొట్టాడు. సలీం వేసిన 16వ ఓవర్లో రోహిత్.. 4, 6 బాదగా రింకూ కూడా ఓ బౌండరీ రాబట్టాడు. కరీమ్ జనత్ వేసిన 17వ ఓవర్లోనూ రోహిత్ 4, 6 తో స్కోరు వేగాన్ని పెంచాడు. అజ్మతుల్లా వేసిన 19వ ఓవర్లో సిక్సర్ బాది 90లలోకి వచ్చిన రోహిత్.. వరుసగా రెండు బౌండరీలు బాది పొట్టి ఫార్మాట్లో ఐదో శతకాన్ని పూర్తిచేశాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి సిక్సర్ కొట్టిన రింకూ.. 36 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆఖరి ఓవర్లో రోహిత్.. 4, 6, 4 తో పాటు రింకూ కూడా హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో భారత్ 200 పరుగుల మైలురాయిని దాటింది. ఆఖరి ఓవర్లో ఏకంగా 36 పరుగులొచ్చాయి. తొలి పది ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసిన భారత్.. తర్వాతి 60 బంతుల్లో 151 పరుగులు రాబట్టడం విశేషం.