దేవరకద్ర రూరల్, జనవరి 19: క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలోని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి స్వగ్రామం అల్లీపురంలో రూ.కోటి 71 లక్షలతో నిర్మించిన ఇందిరమ్మ స్మారక మినీ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియాన్ని బుధవారం క్రీడా మంత్రి ప్రారంభించారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్ వంటి క్రీడా పోటీలకు అనువుగా నిర్మించిన ఈ స్టేడియాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి సరదాగా బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు.