భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో దుమ్మురేపాడు. తనపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. కేవలం ఒకే ఒక్క త్రోతో నేరుగా ఫైనల్కు దూసుకెళ్లాడు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా.. తొలి ప్రయత్నంలోనే బరిసెను 88.77 మీటర్ల దూరం విసిరిన నీరజ్.. వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్కు చేరడంతో పాటు.. వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. నీరజ్ బాటలోనే మరో ఇద్దరు భారత త్రోయర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ తుదిపోరుకు చేరడం విశేషం.
ఒకే ప్రయత్నంలో ఫైనల్కు అర్హత సాధిస్తానని వార్మప్ సమయంలోనే అనుకున్నా. బరిసెను సరైన దిశలో వదిలా.. ఈ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. 90 శాతం శక్తిని మాత్రమే వినియోగించా.. ఫైనల్ కోసం సామర్థ్యాన్ని దాచిపెట్టుకున్నా. తుది పోరులో పోటీ అధికంగా ఉంటుంది. ఇంతకుమించి కష్టపడక తప్పదు.
– నీరజ్ చోప్రా
బుడాపెస్ట్: అథ్లెటిక్స్లో భారత్కు ఏకైక ఒలింపిక్ స్వర్ణం అందించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్రపంచ చాంపియన్షిప్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాడు. హంగేరి రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో శుక్రవారం నీరజ్ తొలి ప్రయత్నంలోనే బరిసెను 88.77 మీటర్ల దూరం విసిరాడు. దీంతో అలవోకగా ఫైనల్కు చేరడంతో పాటు పారిస్ (2024) ఒలింపిక్స్ అర్హత మార్కు (85.50 మీటర్లు) అందుకొని విశ్వక్రీడల బెర్తు ఖరారు చేసుకున్నాడు. ఈ సీజన్లో నీరజ్కు ఇదే బెస్ట్ ప్రదర్శన కాగా.. వ్యక్తిగత అత్యుత్తమానికి (89.94 మీటర్లు) దాదాపు ఒక మీటర్ దూరంలో నిలిచాడు. మరోవైపు భారత త్రోయర్లు డీపీ మను (81.31 మీటర్లు), కిషోర్ జెనా (80.55 మీటర్లు) కూడా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించారు. ‘ముగ్గురు భారత త్రోయర్లు ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇది భారత జావెలిన్ చరిత్రలో మరిచిపోలేని రోజు’ అని టీమ్ కోచ్ పేర్కొన్నాడు. నిరుడు అమెరికా వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో రజతం నెగ్గిన నీరజ్.. ఆదివారం ఫైనల్లో స్వర్ణం కోసం పోటీ పడనున్నాడు.
వచ్చాడు.. వేశాడు.. వెళ్లాడు!
భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన 25 ఏండ్ల నీరజ్ చోప్రా.. గ్రూప్-ఎ క్వాలిఫయింగ్ రౌండ్లో క్షణాల్లో తన పని పూర్తి చేసుకొని వెళ్లాడు. ఈ టోర్నీలో ఫైనల్ అర్హత మార్క్ 83 మీటర్లు కాగా.. తొలి ప్రయత్నంలోనే దానికంటే ఎంతో మెరుగైన ప్రదర్శన చేసిన నీరజ్.. ఇక రెండో ప్రయత్నం చేయలేదు. మరో భారత త్రోయర్ మను రెండో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన చేయగా.. వీసా ఇక్కట్లు దాటుకొని హంగేరీలో అడుగుపెట్టిన కిషోర్ ప్రపంచ చాంపియన్షిప్లో బరిలోకి దిగిన తొలిసారే ఫైనల్కు అర్హత సాధించాడు. రెండు గ్రూప్ల్లో కలిపి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 12 మంది ఫైనల్కు చేరారు. క్వాలిఫయింగ్లో పాకిస్థాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ (86.79 మీటర్లు) రెండో స్థానంలో నిలువడంతో పాటు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకోగా.. జాకబ్ (83.50 మీ.; చెక్ రిపబ్లిక్), జూలియన్ వెబర్ (82.39 మీ.; జర్మనీ) ఆ తర్వాతి ప్లేస్లు దక్కించుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ (2022), ఆసియా గేమ్స్ (2018), కామన్వెల్త్ గేమ్స్ (2018), డైమండ్ లీగ్ (2022)లో స్వర్ణాలు నెగ్గిన నీరజ్.. ఇప్పటి వరకు ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గలేదు. క్వాలిఫయింగ్ రౌండ్లో కనబర్చిన ప్రదర్శన తుదిపోరులోనూ కొనసాగిస్తే.. మరో అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నాడు. కేవలం ఎంపిక చేసిన టోర్నీల్లో మాత్రమే బరిలోకి దిగుతున్న నీరజ్.. ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు టోర్నీల్లో (దోహా, లుసానే డైమండ్ లీగ్స్) మాత్రమే పాల్గొని రెండింట్లోనూ స్వర్ణాలు నెగ్గాడు.