హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా హైదరాబాద్లో సందడి చేశాడు. ఇటీవలే హాంగ్జౌ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన నీరజ్ సోమవారం అండర్ ఆర్మర్ షోరూమ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అంతకుముందు గచ్చిబౌలి స్టేడియంతో పాటు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని సందర్శించిన నీరజ్..యువ అథ్లెట్లతో సరదాగా గడిపాడు. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్, డైమండ్ లీగ్, కామన్వెల్త్, ఆసియాగేమ్స్లో పసిడి పతకాలు సొంతం చేసుకున్న నీరజ్.. బరిలో ఉన్నంత వరకు తాను ఇదే జోరు కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా నీరజ్ మాట్లాడుతూ ‘ఈ సీజన్లో కచ్చితంగా 90 మీటర్ల మార్క్ను అధిగమిస్తానన్న నమ్మకం నాకుంది. గాయాలు అనేవి కెరీర్లో భాగం. అయినా ఎక్కడా ఆత్మైస్థెర్యం కోల్పోకుండా ముందుకు సాగుతూ పసిడి పతకాలు సాధిస్తున్నాను. 90మీటర్ల మార్క్ చేరుకునేందుకు నా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి’ అని అన్నాడు.