బ్యాంకాక్: థాయ్లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ముందంజ వేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 22-20, 21-19తో వాంగ్ జు వీ(చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించాడు. 45 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రత్యర్థి నుంచి దీటైన పోటీ ఎదురైనా..వెనుకకు తగ్గకుండా శ్రీకాంత్ పోరాడాడు. మిగతా మ్యాచ్ల్లో మిథున్ మంజునాథ్ 21-17, 21-8తో జాసన్ గునవాన్(కెనడా)పై, ముత్తుస్వామి సుబ్రమణ్యన్ 21-14, 21-17తో లియోంగ్ జున్ హో(మలేషియా)పై గెలిచారు. సమీర్వర్మ 14-21, 18-21తో అంగుస్ ఎంగ్(హాంకాంగ్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్లో మాల్విక బన్సోద్ 22-20, 21-8తో లుసియా కాస్టిలోపై గెలిచి ముందంజ వేసింది.