ఆల్మాటీ(కజకిస్థాన్): ప్రతిష్ఠాత్మక ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో భారత్కు చెందిన సవితశ్రీ కాంస్య పతకంతో మెరిసింది. 15 ఏండ్ల భారత మహిళా అంతర్జాతీయ మాస్టర్ సవితశ్రీ 11 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. తొమ్మిదో రౌండ్లో కజకిస్థాన్కు చెందిన జనసయ అబ్దుమాలిక్ చేతిలో పరాజయం సవితశ్రీ తొలి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాన్ని దెబ్బతీసింది. కాగా చైనాకు చెందిన టాన్ జోంగ్యి టైటిల్ను దక్కించుకోగా, కజకస్థాన్కు చెందిన సదుయకసోవ రజతం గెలుచుకుంది. మెగాటోర్నీలో విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి తర్వాత పతకం గెలిచిన మూడో భారత ప్లేయర్గా సవితశ్రీ రికార్డుల్లోకెక్కింది. హంపి ఆరో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. మరోవైపు పురుషుల విభాగంలో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ టైటిల్ విజేతగా నిలువగా, యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్కు ఐదో స్థానం దక్కింది. ఆఖరిదైన 13వ రౌండ్లో అర్జున్..షాక్రియార్ మెమ్దైరోవ్(అజార్బైజాన్)పై గెలిచి తొమ్మిది పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. నిహాల్ సరీన్, విదిత్ సంతోష్ గుజరాతీ వరుసగా 10, 15 స్థానాల్లో నిలిచారు.