Asian Games | ఆసియా గేమ్స్లో భారత్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. విభాగం ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో మన ప్లేయర్లు దూసుకెళుతున్నారు. షూటింగ్లో తమ ఆధిపత్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ పసిడి వెలుగులు విరజిమ్మింది. సరబ్జ్యోత్సింగ్, అర్జున్సింగ్, శివనార్వల్ తమ చెక్కుచెదరని గురితో అగ్రస్థానంలో నిలిచారు. వుషులో మణిపూర్ మణిపూస రోషిబినాదేవి రజతం తో మెరిసింది. ఓవైపు మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితుల్లో తన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నా..దేశం తరఫున పతకం సాధించి ఔరా అనిపించింది. ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత డ్రెస్సాజ్ వ్యక్తిగత ఈవెంట్లో అనూష్ అగర్వాలా కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. బాక్సింగ్లో నిశాంత్, జాస్మిన్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లగా, దీపక్కు చుక్కెదురైంది.
హాంగ్జౌ: ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ షూటింగ్లో భారత్ పతక హవాకు తిరుగులేకుండా పోయింది. మణిపూర్ వుషు ప్లేయర్ నరోమ్ రోషిబినా దేవి వెండి వెలుగులు విరజిమ్మింది. గురువారం జరిగిన మహిళల 60కిలోల విభాగం ఫైనల్లో రోషిబినా 0-2తో వు జియోవి(చైనా) చేతిలో పోరాడి ఓడింది. ప్రత్యర్థి తన కంటే మెరుగైనా దేవి ఎక్కడా వెనుకకు తగ్గకుండా పోరాటం కనబరిచింది. పదునైన పంచ్లకు తోడు కాళ్లతో కిక్లు సంధిస్తూ చైనా ప్లేయర్పై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నం చేసింది. అయితే తన అనుభవాన్నంతా ఉపయోగించిన చైనా ప్లేయర్ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుని పసిడి ఒడిసిపట్టుకుంది. తన సొంత రాష్ట్రం మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బౌట్కు ముందు ఒకింత ఒత్తిడికి లోనైన రోషిబినా తుదికంటా పోరాడింది. బౌట్ ముగిసిన తర్వాత దేవి స్పందిస్తూ ‘మణిపూర్ ప్రస్తుతం మంటల్లో ఉంది. ఇరు వర్గాల మధ్య పోరు జరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో నా గ్రామానికి వెళ్లే అవకాశం లేదు. మమ్మల్ని, మా కుటుంబ సభ్యులను కాపాడుతున్న వారికి, బాధలు పడుతున్న వాళ్లకు నా ఈ ఆసియా గేమ్స్ పతకాన్ని అంకితం చేస్తున్నాను. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పోరు కొనసాగుతూనే ఉంది. మునుపటి పరిస్థితులు మళ్లీ ఎప్పుడు వస్తాయని చూస్తున్నాం’అని కన్నీటి పర్యంతమైంది.
ఈక్వెస్ట్రియన్లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. గురువారం జరిగిన డ్రెస్సాజ్ ఈవెంట్లో భారత ప్లేయర్ అనూష్ అగర్వాలా కాంస్య పతకంతో మెరిశాడు. ఆసియాగేమ్స్ చరిత్రలో డ్రెస్సాజ్ వ్యక్తిగత విభాగంలో భారత్కు తొలి పతకం కావడం విశేషం. పోటీ ఆసాంతం తన గుర్రంతో కలిసి అద్భుత ప్రదర్శన కనబరిచిన అనూష్ 73.030 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు. మహమ్మద్ కాబిల్(75.78, మలేషియా), జాక్వెలిన్(73.45, హాంకాంగ్) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ విభాగంలో పోటీపడ్డ భారత ప్లేయర్ హృదయ్ విపుల్ గుర్రం గాయపడటంతో పతక పోరు నుంచి నిష్క్రమించాడు. ఇప్పటికే ఈ టోర్నీ డ్రెస్సాజ్ టీమ్ విభాగంలో భారత్ చరిత్రాత్మక స్వర్ణం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఆసియా గేమ్స్ మొదలైన 1951 నుంచి ఇప్పటి వరకు భారత్ 13 పతకాలు కైవసం చేసుకుంది.
గురువారం జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో సరబ్జ్యోత్సింగ్, అర్జున్సింగ్ చీమా, శివ నార్వల్తో కూడిన భారత త్రయం స్వర్ణంతో మెరిసింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 1734 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా(1733), వియత్నాం(1730) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో సరబ్జ్యోత్సింగ్ 580 స్కోరుతో ఆకట్టుకోగా, అర్జున్సింగ్(578), శివ నార్వల్(576) కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. సరాసరి పాయింట్ల ఆధారంగా ఆయా దేశాల షూటర్లు ఫైనల్స్కు అర్హత సాధించారు. తుది పోరులోనూ అద్భుత ప్రదర్శన కొనసాగించడం మనకు పసిడి పతకం దక్కేందుకు కారణమైంది. ఇదిలా ఉంటే 10మీటర్ల ఎయిర్పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సరబ్జ్యోత్సింగ్(199) తృటిలో పతకం చేజార్చుకున్నాడు. ఫామ్ క్వాంగ్ హుయి(చైనా), లీ వోన్హో(కొరియా), వ్లాదిమిర్ చెకెనోవ్(ఉజ్బెకిస్థాన్) వరుసగా స్వర్ణ, రజత కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఆసియాగేమ్స్లో ఇప్పటి వరకు భారత్కు షూటింగ్లో నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలు లభించాయి.
మరోవైపు సునీల్ ఛెత్రీ సారథ్యంలోని భారత ఫుట్బాల్ జట్టు ఆసియా గేమ్స్ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో భారత్ 0-2తో సౌదీ అరేబియా చేతిలో ఓటమిపాలైంది. హాకీలో భారత్ 4-2తో డిఫెండింగ్ చాంపియన్ జపాన్పై విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్కు బెర్తుకు మరింత చేరువైంది. భారత్ తరఫున అభిషేక్(13ని, 48ని)డబుల్ గోల్స్ చేయగా, మన్దీప్సింగ్(24ని), అమిత్ రోహిదాస్(34ని) ఒక్కో గోల్ చేశారు. శనివారం పాకిస్థాన్తో భారత్ తలపడే అవకాశముంది. బాక్సింగ్లో నిశాంత్దేవ్, జాస్మిన్ లంబోరియా క్వార్టర్స్లోకి ప్రవేశించగా, దీపక్ బోరియాకు చుక్కెదురైంది. టెన్నిస్లో రామ్కుమార్, సాకేతి మైనేని డబుల్స్లో ఫైనల్లోకి ప్రవేశించి కనీసం రజతం ఖాయం చేశారు.
షూటింగ్: మహిళల 10మీ ఎయిర్ పిస్టల్(వ్యక్తిగత, టీమ్): దివ్య, ఇషాసింగ్, పాలక్- ఉ: 6.30
పురుషుల 50మీ రైఫిల్3 పొజిషన్-ప్రతాప్సింగ్, స్వప్నిల్, అఖిల్-ఉ: 6.30
టెన్నిస్: పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్ ఫైనల్స్, పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ సెమీస్: ఉ: 7.30
బాక్సింగ్: క్వార్టర్స్: పర్వీన్ హుడా, నిఖత్ జరీన్, లక్ష్య చాహర్, సంజీత్-
ఉ: 11.30
బ్యాడ్మింటన్: పురుషుల, మహిళల టీమ్: ఉ: 10.30
హాకీ: భారత్ X మలేషియా(మహిళల): సా: 4.00
బాస్కెట్బాల్: భారత్ X మలేషియా
మ: 12 నుంచి