న్యూఢిల్లీ : ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఫైనల్లో యువ షూటర్ అనీశ్ భన్వాల కాంస్య పతకంతో మెరిశాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో అనీశ్ 23 పాయింట్లతో మూడో స్థానంలో నిలువగా, యోషియోకా దాయి(31, జపాన్), చిర్యుకిన్ నికిత(28, కజకిస్థాన్) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.
ఇదే విభాగంలో ఆదర్శ్సింగ్(11) ఆరో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు అనీశ్(574), ఆదర్శ్సింగ్(573) పాయింట్లతో ఫైనల్ పోరుకు అర్హత సాధించడగా, నాలుగో సిరీస్ తర్వాత ఆదర్శ్ ఎలిమినేట్ అయ్యాడు. మరోవైపు 50మీటర్ల జూనియర్ రైఫిల్ ఈవెంట్లో అద్రియాన్ కర్మాకర్, రోహిత్ కన్యాన్, హేమంత్ బర్మన్తో కూడిన త్రయం ఫైనల్లో నిలిచింది. పురుషుల జూనియర్ 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ కేటగిరీలో సూరజ్ శర్మ(23), ముకేశ్ నేలవల్లి(19) వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. ఓవరాల్గా భారత్ ప్రస్తుతం 41స్వర్ణాలు, 19 రజతాలు, 15 కాంస్య పతకాలతో కొనసాగుతున్నది.