సోఫియా (బల్గేరియా): ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల 57కిలోల విభాగంలో హుస్సామ్ 4-1 తేడాతో మిచెలీ బ్లాడస్సీ(ఇటలీ)పై అద్భుత విజయం సాధించాడు. తొలి రౌండ్లో ఇటలీ బాక్సర్ నుంచి హుస్సామ్కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తన ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ మిచెలీ పంచ్లతో చెలరేగాడు. అయితే రెండో రౌండ్లో పుంజుకున్న ఈ ఇందూరు బాక్సర్ తన అనుభవాన్ని వినియోగించుకుంటూ మిచెలీపై ప్రతిదాడికి దిగి కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఓవైపు ప్రత్యర్థి పంచ్లను కాచుకున్న హుస్సామ్ అదే రీతిలో దీటైన సమాధానమిచ్చాడు.
శుక్రవారం జరిగే క్వార్టర్స్ పోరులో బెజియాన్ ఆర్టర్(అర్మేనియా)తో హస్సామ్ తలపడుతాడు. మరోవైపు పురుషుల 51 కిలోల విభాగంలో బిశ్వామిత్రా చోంగ్తామ్ 5-0తో కెన్జె మురాటులీ(కజకిస్థాన్)పై అలవోక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. క్వార్టర్స్లో టాలీ జామర్(అమెరికా)తో బిశ్వామిత్రా అమీతుమీ తేల్చుకోనున్నాడు.