Womens Cricket Team : మహిళల ప్రీమియర్ లీగ్(Womens Premiere League 2023)లో అదరగొట్టిన భారత మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు. అవును.. భారత మహిళల క్రికెట్ జట్టు(Womens Cricket Team) వచ్చే నెల(జూలై)లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. సిరీస్లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. టీమిండియా టూర్ గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(Bangladesh Cricket Board) మహిళా విభాగం అధ్యక్షురాలు షఫియుల్ అలమ్ చౌధురి నదెల్(Shafiul Alam Chowdhury Nadel) వెల్లడించింది.
‘అవును.. మా జట్టు భారత మహిళ జట్టుతో జూలైలో వన్డే సిరీస్ ఆడనుంది. అన్ని మ్యాచ్లు షేర్-ఇ-బంగ్లా నేషనల్ స్టేడియంలోనే జరగనున్నాయి’ అని షఫియుల్ వెల్లడించింది. అంతేకాదు భారత పర్యటన షెడ్యూల్ను ఎస్బీఎన్ఎస్ ఇప్పటికే విడుదల చేసింది. భారత జట్టు జూలై 9వ తేదీన ఢాకాకు చేరుకోనుంది.
బంగ్లాదేశ్ గడ్డపై మహిళా క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం 11 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిగా 2012లో బంగ్లా జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో తలపడింది. దాంతో, భారత్, బంగ్లా సిరీస్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 9న జరిగే తొలి టీ20లో బంగ్లా, భారత మహిళల జట్లు తలపడతాయి. రెండో టీ20 జూలై 11న, మూడో టీ20 జూలై 13 ఉన్నాయి. ఆ తర్వాత మూడు రోజుల విరామం తర్వాత వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే జూలై 16న జరగనుంది. రెండో వన్డే 19న, 22న మూడో వన్డే మ్యాచ్లు నిర్వహిస్తారు.