కొలంబో: దిగ్గజ ప్లేయర్ మిథాలీరాజ్ ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం భారత మహిళల క్రికెట్ జట్టు తొలి పోరుకు సిద్ధమవుతున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం దంబుల్లా వేదికగా జరుగనున్న తొలి టీ20 కోసం హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత బృందం.. ఆదివారం కొలంబో చేరుకుంది. మన అమ్మాయిలకు లంకలో ఘనస్వాగతం లభించగా.. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ సిరీస్లో భాగంగా భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. పర్యటనకు బయలుదేరే ముందు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్తో జట్టు సభ్యులు సమావేశమయ్యారు. మిథాలీ, జులన్ వంటి వాళ్లు లేకుండా తొలిసారి యువ జట్టుతో విదేశీ పర్యటనకు వెళ్తున్నామని.. జట్టులో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు కొదవలేదని హర్మన్ప్రీత్ చెప్పింది.