మూడో వన్డేలోనూ భారత మహిళల ఓటమి
క్వీన్స్టౌన్: కివీస్ గడ్డపై పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు వరుసగా మూడో వన్డేలోనూ పరాజయం పాలైంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో మిథాలీరాజ్ బృందం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 0-3తో సిరీస్ కోల్పోయింది. శుక్రవారం జరిగిన పోరులో భారత్ 3 వికెట్ల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన మన జట్టు 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (41 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), షఫాలీ వర్మ (51), దీప్తి శర్మ (69 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. గత రెండు వన్డేల్లో హాఫ్సెంచరీలు బాదిన కెప్టెన్ మిథాలీ (23) ఎక్కువసేపు నిలువలేకపోగా.. హర్మన్ప్రీత్ కౌర్ (13) మరోసారి నిరాశ పరిచింది. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద లక్ష్యఛేదన కావడం విశేషం. అమేలీ కెర్ (67), లారెన్ డాన్ (64), సాటర్వైట్ (59) ఫిఫ్టీలతో కదంతొక్కారు. సీనియర్ పేసర్ జులన్ గోస్వామి మూడు వికెట్లు పడగొట్టినా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో భారత్కు హ్యాట్రిక్ ఓటమి తప్పలేదు. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే మంగళవారం ఇక్కడే జరుగనుంది.