మెక్కే: ఇండియన్ వుమెన్స్ టీమ్ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. వాళ్ల 26 వరుస విజయాల రికార్డుకు బ్రేక్ వేసింది. ఆదివారం ఆ టీమ్తో జరిగిన మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో గెలిచింది. అంతేకాదు వన్డేల్లో ఇండియన్ వుమెన్స్ టీమ్ చేజ్ చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం. ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 3 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. అయితే ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ ఎగరేసుకుపోయింది. ఇక ఈ నెల 30 నుంచి ఈ రెండు టీమ్స్ ఏకైక పింక్ బాల్ టెస్ట్లో తలపడనున్నాయి.
రెండో వన్డేలోనూ గెలిచేలా కనిపించిన ఇండియన్ వుమెన్స్ టీమ్.. చివరి బంతికి ఝులన్ గోస్వామి నోబాల్ వేయడంతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే మూడో వన్డేలో మాత్రం అలాంటి తప్పిదానికి తావివ్వకుండా జాగ్రత్తగా ఆడారు. షెఫాలీ వర్మ (91 బంతుల్లో 56), యాస్తికా భాటియా (69 బంతుల్లో 64) చేజింగ్లో రాణించారు. దీప్తి శర్మ (30 బంతుల్లో 31), స్నేహ్ రాణా (27 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్ కూడా విజయంలో కీలకపాత్ర పోషించాయి. మహిళల క్రికెట్ గ్రేటెస్ట్ చేజింగ్లలో ఒకటిగా దీనిని అభివర్ణించవచ్చు.