Rohan Bopanna | ఫ్లోరిడా: మియామి ఓపెన్ ఫైనల్లో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న, ఆస్ట్రేలియా సహచరుడు మాథ్యూ ఎబ్డెన్తో కలిసి అదరగొట్టాడు. కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గిన ఈ జోడీ.. తాజాగా మియామి ఓపెన్లోనూ జోరు కొనసాగించింది. శనివారం రాత్రి ముగిసిన పురుషుల డబుల్స్ ఫైనల్ పోరులో బోపన్న ద్వయం.. 6-7 (7-3), 6-3, 10-6 తేడాతో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా), ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)పై గెలిచింది. గంటా 42 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి గేమ్లో వెనుకబడ్డా తర్వాత పుంజుకుని వరుస గేమ్స్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది.
ఈ విజయం ద్వారా 44 ఏండ్ల వయసులో ‘ఏటీపీ మాస్టర్స్ 1000’ టైటిల్ నెగ్గిన ఆటగాడిగా బోపన్న నయా చరిత్ర సృష్టించాడు. బోపన్నకు ఇది 14వ ఏటీపీ మాస్టర్స్ ఫైనల్ కాగా ఆరో మాస్టర్స్ టైటిల్. మొత్తంగా అతడి కెరీర్లో ఇది 26వ డబుల్స్ టైటిల్. ఈ టోర్నీలో బోపన్న ఫైనల్ చేరిన నేపథ్యంలో భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తర్వాత ఏటీపీ నిర్వహించే అన్ని (9) మాస్టర్స్ ఈవెంట్స్లో ఫైనల్ ఆడిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.
మహిళల సింగిల్స్లో నాలుగో సీడ్ కజకిస్తాన్ ప్లేయర్ ఎలీనా రిబాకినాకు అన్సీడెడ్ అమెరికన్ క్రీడాకారిణి డానియల్ కొలిన్స్ షాకిచ్చింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్లో కొలిన్స్.. 7-5, 6-3 తేడాతో రిబాకినాను చిత్తు చేసి మహిళల టైటిల్ గెలుచుకుంది.