Shubman Gill | చెన్నై: సొంతగడ్డపై మరోసారి వన్డే ప్రపంచకప్ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టుకు అదిరే ఆరంభం లభించింది. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ బృందం బంపర్ విక్టరీ కొట్టింది. అదే ఊపులో రెండో విజయంపై కన్నేసిన టీమ్ఇండియా అఫ్గానిస్థాన్తో మ్యాచ్ కోసం సోమవారం ఢిల్లీకి బయలుదేరింది. అయితే.. స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ మాత్రం జట్టుతో కలవలేదు. ఆసీస్తో మ్యాచ్కు ముందు డెంగీ జ్వరం బారిన పడిన ఈ ఓపెనర్ పూర్తిగా కోలుకోలేదు. దాంతో చెన్నైలోనే ఉండిపోయాడు. ఓపెనర్ గిల్ సోమవారం భారత జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లడం లేదు. జ్వరం బారిన పడిన అతడు చెన్నైలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
టాపార్డర్లో విధ్వంసక ఇన్నింగ్స్లు ఆడే గిల్.. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీల మోత మోగించాడు. రోహిత్తో కలిసి పలు సందర్భాల్లో జట్టుకు మంచి శుభారంభాలు ఇచ్చాడు. అలాంటిది గిల్ ప్రపంచ కప్లో వరుసగా రెండో మ్యాచ్కు దూరం కావడం భారత్కు పెద్ద లోటు. ఎందుకంటే.. కంగారూలపై గిల్ స్థానంలో ఓపెనర్గా వచ్చిన ఇషాన్ కిషన్ గోల్డెన్ డక్తో నిరాశపరిచాడు. ఆ వెంటనే హిట్మ్యాన్, శ్రేయస్ అయ్యర్ కూడా సున్నాకే వెనుదిరగడంతో టీమ్ఇండియా ఓటమి ఖాయమనుకున్నారంతా. కానీ, కింగ్ కోహ్లీ(85), రాహుల్(91 నాటౌట్) అద్భుత అర్ధ శతకాలతో 6 వికెట్లతో గెలిచింది. విజయోత్సాహంలో ఉన్న భారత్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం అఫ్గానిస్థాన్తో తలపడనుంది.