గోల్డ్కోస్ట్: భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన కొత్త చరిత్ర లిఖించింది. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడమే లక్ష్యంగా ప్రత్యర్థిపై విరుచుకుపడింది. గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టు ఆడుతున్నది తొలిసారే అయినా..ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో మందన ఆకాశమే హద్దుగా చెలరేగింది. మందన (127; 22 ఫోర్లు, ఒక సిక్సర్) రికార్డు సెంచరీతో చెలరేగడంతో ఆసీస్తో గులాబీ పోరులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. వరుసగా రెండో రోజూ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడగా.. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 132/1తో రెండో రోజు ఆట కొనసాగించిన మిథాలీ బృందం.. కంగారూ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ క్రమంలో స్మృతి 170 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. ఆసీస్ గడ్డపై భారత మహిళల జట్టు తరఫున ఇదే తొలి శతకం కాగా.. గులాబీ టెస్టులో కూడా ఇదే మొదటిది. పూనమ్ రౌత్ (36) కెప్టెన్ మిథాలీ రాజ్ (30) ఫర్వాలేదనిపించగా.. యస్తిక భాటియా (19) ఆకట్టుకోలేకపోయింది. దీప్తి శర్మ (12), తానియా భాటియా (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో సోఫియా రెండు వికెట్లు పడగొట్టింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 276/5 (మందన 127, పూనమ్ 36; సోఫియా 2/28).
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ చేసిన తొలి భారత మహిళగా మందన రికార్డుల్లోకెక్కింది. గులాబీ టెస్టులో భారత్కిదే తొలి శతకం