టోక్యో: ఒలింపిక్స్ వేదికైన టోక్యోలో భారత షూటింగ్ జట్టు అడుగుపెట్టింది. 15 మందితో కూడిన భారత జట్టు శనివారం ఉదయం టోక్యోలో దిగింది. ఈ సందర్భంగా ఆటళ్లతోపాటు సహాయక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నది. షూటింగ్ జట్టులో మనూ బాకర్, సౌరభ్ చౌదురి వంటి యువ క్రీడాకారులతోపాటు సంజీవ్ రాజ్పుత్ వంటి సీనియర్లు కూడా ఉన్నారు. యువత, సీనియర్లతో కూడిన ఈ జట్టు ఒలింపిక్స్లో భారత్కు పతకాలు సాధించిపెడుతుందని భారీ ఆశలు ఉన్నాయి. భారత జట్టు ఈ నెల 24న పతకాల వేట ప్రారంభించనుంది.
కాగా, టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం ఉన్నది. అయితే ఇవాళ టోక్యోలోని ఒలింపిక్ విలేజ్లో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. వేలాది మంది అథ్లెట్లు పాల్గొన్న మహాక్రీడల్లో మహమ్మారి ఎలా విజృంభిస్తుందో అన్న భయం కూడా ఉంది. విలేజ్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న సమయంలో.. తొలి కేసు బయటపడినట్లు టోక్యో నిర్వాహక కమిటీ ప్రతినిధి మాసా టకాయా తెలిపారు. గేమ్స్ నిర్వహణ కోసం విదేశాల నుంచి వచ్చిన ఓ విజిటర్కు వైరస్ సంక్రమించినట్లు టోక్యో 2020 సీఈవో తోషిరో ముటో తెలిపారు. ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవారో తెలియజేయలేదు.
ఇటీవల ఓ అథ్లెట్తో పాటు కొందరు ఒలింపిక్ సిబ్బందికి కరోనా వైరస్ సంక్రమించింది. జూలై 13, 14వ తేదీల్లో ఆరుగురికి కరోనా సోకినట్లు టోక్యో ఒలింపిక్స్ తన వెబ్సైట్లో పేర్కొన్నది. జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరిగే క్రీడల్లో.. ఒలింపిక్స్ విలేజ్లో సుమారు 11 వేల మంది అథ్లెట్లు బస చేయనున్నారు. బ్రెజిల్ ఒలింపిక్ బృందం ఉంటున్న హోటల్లోనూ భారీ సంఖ్యలో ఇటీవల పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.
భారత సెయిలింగ్ జట్టు మంగళవారం టోక్యో చేరుకుంది. భారత్ నుంచి ఒలింపిక్స్ కోసం టోక్యోలో అడుగుపెట్టిన తొలి బృందం ఇదే. వరుణ్ ఠక్కర్, గణపతి చెంగప్ప, విష్ణు శరవణన్, నేత్ర కుమనన్… కోచ్లు, ఇతర సహాయ సిబ్బందితో కూడిన సెయిలింగ్ జట్టు యూరోప్లో శిక్షణ అనంతరం అక్కడి నుంచే నేరుగా జపాన్కు పయనమైంది.
టోక్యో ఒలింపిక్స్ కోసం 228 మందితో కూడిన భారత బృందం జపాన్కు పయనమవుతుంది. భారత్ తరఫున 18 క్రీడాంశాల్లో మొత్తం 119 క్రీడాకారులు పోటీపడనున్నారు. ఇందులో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. మిగతా వారంతా కోచింగ్, ఫిజియో సిబ్బంది.