Asia Qualifiers 2024: ఈ ఏడాది జులై-ఆగస్టు మధ్య పారిస్ వేదికగా జరుగబోయే పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు మరో భారత షూటర్ బెర్త్ ఖాయం చేసుకుంది. యువ షూటర్ రిథమ్ సంగ్వాన్ భారత్ నుంచి పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనబోయే 16వ షూటర్గా నిలిచింది. జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్లో భాగంగా 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం గెలవడంతో ఆమె ఒలింపిక్స్ బెర్త్ను కన్ఫమ్ చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్కు భారత్ నుంచి ఇదివరకే 15 మంది షూటర్లు తమ బెర్తులను ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. 2021లో జపాన్ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో భారత్.. 15 మంది షూటర్లతో బరిలోకి దిగగా తాజాగా ఆ సంఖ్య 16కు చేరింది.
హర్యానకు చెందిన 20 ఏండ్ల సంగ్వాన్.. గతేడాది హాంగ్జౌ వేదికగా ముగిసిన ఆసియా క్రీడలలో భాగంగా 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గింది. తాజాగా ఆసియా క్వాలిఫయర్స్లో మాత్రం సంగ్వాన్.. 28 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. చైనాకు చెందిన యంగ్ జిన్ 41 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకోగా.. కొరియాకు చెందిన కిమ్ యెజి 32 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఆసియా క్వాలిఫయర్స్లో సంగ్వాన్కు ఇది మూడో పతకం. ఇంతకుముందు ఆమె సోమవారం ముగిసిన పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో ఇషాతో కలిసి గోల్డ్ మెడల్ గెలవగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అర్జున్ సింగ్తో కలిసి సిల్వర్ నెగ్గింది.
Happy to qualify for the Olympic Quota!! https://t.co/cFW0zMneM6
— Rhythm Sangwan (@SangwanRhythm) January 11, 2024