సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): నగర వాసులకు రెండు రోజుల పాటు అద్వితీయ అనుభూతిని పంచిన ఇండియన్ రేసింగ్ లీగ్ ఆదివారంతో ముగిసింది. హైదరాబాద్ నడిబొడ్డులో హుసేన్సాగర్ తీరంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రేస్లను వీక్షించేందుకు నగరవాసులు ఎగబడ్డారు. భాగ్యనగరంలో మొట్ట మొదటి సారి ఈ పోటీలు జరుగగా.. స్వల్ప ప్రమాదాల కారణంగా రేస్లు పూర్తి కాలేదు. కొత్త ట్రాక్పై శనివారం రేసర్లు ప్రాక్టీస్ చేయగా.. ఆదివారం క్వాలిఫయింగ్ రౌండ్తో పాటు ప్రధాన పోటీలు జరుగాల్సి ఉండగా.. ట్రాక్లో రెండు కార్లు ఢీకొనడంతో సమయాభావం వల్ల మొత్తం రేస్లు నిర్వహించలేకపోయారు. వచ్చే ఏడాది ఇదే ట్రాక్పై ఫార్ములా-ఈ రేస్ జరుగాల్సి ఉండగా.. దానికి సన్నాహకంగా ఇండియన్ రేసింగ్ లీగ్ను నిర్వహించారు.
ఈ పోటీల్లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్తో సహా ఆరు జట్లు పాల్గొన్నాయి. మళ్లీ రెండో విడత పోటీలు వచ్చే నెల 10, 11న ఇదే ట్రాక్పై నిర్వహించనున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్ అనంతరం.. జేకే టైర్స్ గోకార్డింగ్ కార్లు కూడా ట్రాక్పై పరుగులు పెట్టాయి. ఈ పోటీలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తిలకించారు. ఈ సందర్భంగా రేసింగ్ నిర్వహకులు మంత్రులను సన్మానించారు. 17 మలుపులతో కూడిన 2.7 కిలోమీటర్ల ఈ ట్రాక్ రేసర్లకు పరీక్షగా నిలువగా.. అంతర్జాతీయ సర్క్యూట్కు అతికినట్లు సరిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేసర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. ఫార్ములా-ఈ పోటీల సమయానికి దీన్ని మరింత సమర్థవంతంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు.