అహ్మదాబాద్: భారీ వర్షం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ ఫైనల్ వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా తుదిపోరును రిజర్వ్ డే (సోమవారం)కు మార్చారు. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్కు సిద్ధమవుతున్న సమయంలో అహ్మదాబాద్లో భారీ వర్షం కురిసింది. అప్పుడప్పుడు వరుణుడు కాస్త శాంతించినట్లు కనిపించడంతో నిర్వాహకులు మ్యాచ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినా.. తిరిగి వర్షం మొదలవడంతో అది సాధ్యపడలేదు.
పలుసార్లు పరిశీలించిన అనంతరం మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోవడంతో ఇరు జట్ల కోచ్లతో మాట్లాడిన అనంతరం రాత్రి 11 గంటలకు మ్యాచ్ రెఫరీ జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు.. వాటితోనే సోమవారం మ్యాచ్కు హాజరుకావొచ్చని అధికారులు వెల్లడించారు. సోమవారం కూడా వర్షం కారణంగా మ్యాచ్ సాగకపోతే.. లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన గుజరాత్ టైటాన్స్ను విజేతగా ప్రకటించనున్నారు.