IPL 2024: వచ్చే ఏడాది ఐపీఎల్ కంటే ముందే ఈ ఏడాది చివర్లో జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ప్రక్రియను భారీగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయంగా ఈ లీగ్ కు క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ వేలాన్ని ఎడారి దేశమైన దుబాయ్లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. డిసెంబర్ 15 నుంచి 19 మధ్య (తేదీ ఖరారుకాలేదు) దుబాయ్ వేదికగా ఐపీఎల్ యాక్షన్ను నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది.
డిసెంబర్ రెండో వారంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం జరగాల్సి ఉంది. వేలం జరిగే నగరం పేరు ఇంకా ప్రకటించకపోయినా డిసెంబర్ 9న డబ్ల్యూపీఎల్ యాక్షన్ ఉండొచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం తర్వాత బీసీసీఐ.. ఐపీఎల్ మీదకు దృష్టి సారించనుంది.
వాస్తవానికి బీసీసీఐ గతేడాది వేలాన్ని ఇస్తాంబుల్ (టర్కీ) వేదికగా నిర్వహించాలని భావించింది. అందుకు గాను ఏర్పాట్లను కూడా పూర్తిచేసిందని వార్తలు వచ్చాయి. కానీ చివరినిమిషంలో ఇస్తాంబుల్ను కాదని కేరళలోని కొచ్చి వేదికగా నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా సుమారు రూ. 48వేల కోట్లు ఆర్జించిన విషయం తెలిసిందే. విలువపరంగా కూడా అంతర్జాతీయంగా ఐపీఎల్.. అమెరికాలో జరిగే నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) తర్వాత రెండో స్థానంలో ఉంది. దేశానికి ఒక ఫ్రాంచైజీ లీగ్ ఉన్నా బీసీసీఐకి కాసులు కురిపిస్తున్న ఐపీఎల్ పరిధిని విశ్వవ్యాప్తం చేయడానికి బీసీసీఐ ఈసారి వేలాన్ని దుబాయ్లో నిర్వహించనున్నట్టు సమాచారం. వన్డే వరల్డ్ కప్ పనుల్లో బిజీగా ఉన్న బీసీసీఐ.. మెగా టోర్నీ ముగిశాక పూర్తివివరాలను ఫ్రాంచైజీలతో పంచుకునే అవకాశమున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.