గ్వాంగ్జూ: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత మిక్స్డ్ జట్టు కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అభిషేక్ వర్మ-అవ్నీత్ కౌర్ జోడీ.. మెక్సికో జంట చేతిలో పోరాడి ఓడింది. కాంస్య పతక పోరులో నాలుగో సీడ్ టర్కీ ద్వయంతో.. ఆరో సీడ్ భారత జోడీ అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో మూడు పతకాలు (మహిళల కాంపౌండ్, మహిళల రికర్వ్ విభాగాల్లో కాంస్యాలు, పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో రజతం) సొంతం చేసుకున్న భారత ఆర్చర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఒలింపియన్లు అతానుదాస్, దీపిక కుమారిపై వేటు వేసి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వగా.. కొరియా అడ్డంకిని అధిగమించేందుకు మనవాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పురుషుల రికర్వ్ విభాగంలో భారత జట్టు నిరాశ పరిచింది.