చివరి నిమిషంలో మన్దీప్ సింగ్ సూపర్ ఆటతో 2016 ఒలింపిక్స్ హాకీ విజేత అర్జెంటీనాకు టీమిండియా షాకిచ్చింది. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్లో భాగంగా కళింగ హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో అంతకు ముందు జరిగిన మ్యాచ్లో రెండు జట్లు 2-2తో నిలిచాయి. చివర షూటవుట్ల 1-3 తేడాతో భారత్ ఓడిపోయింది.
ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆడిన భారత జట్టు గట్టి పోటీ నిచ్చింది. తొలి హాఫ్ టైంలో ఇరు జట్లూ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. అయితే రెండో హాఫ్లో భారత ఆటగాళ్లు ఎటాకింగ్ ఆటతో అర్జెంటీనా ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు. పెనాల్టీలు సాధించి వాటిని గోల్స్గా మార్చారు. దీంతో భారత జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది.
అలాంటి సమయంలో పుంజుకున్న అర్జెంటీనా కూడా రెండో గోల్స్ చేసింది. ఆ తర్వాత భారత్ మరో గోల్ చేసినా.. రివ్యూలో భారత ఆటగాళ్లు సర్కిల్లోనే బాల్ కలెక్ట్ చేసినట్లు తేలడంతో ఆ గోల్ను వెనక్కు తీసుకున్నారు. ఆ తర్వాత అర్జెంటీనా మరో గోల్ చేయడంతో 3-3తో రెండు జట్లూ సమానంగా నిలిచాయి. ఇక ఈ మ్యాచ్ కూడా షూటవుట్కు వెళ్తుందని అంతా భావించారు.
అయితే ఆట ముగియడానికి మరో 26 సెకన్లు ఉందనగా.. జుగ్రాజ్ సింగ్ నుంచి బంతిని అందుకున్న మన్దీప్ సింగ్ అద్భుతమైన టచ్తో గోల్ చేశాడు. దీంతో మ్యాచ్ ముగిసే సరికి భారత జట్టు 4-3తో విజయం సాధించింది. భారత డిఫెండర్ వరుణ్ కుమార్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.