న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం, మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ హాకీ ఇండియా (హెచ్ఐ)తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. భారత జూనియర్ జట్టు కోచ్గా అద్భుత ఫలితాలు సాధించిన తనను పక్కన పెట్టిన హెచ్ఐ విదేశీ కోచ్ వైపు మొగ్గు చూపుతోందని ఆరోపించాడు. ఆటగాడిగా దేశానికి రెండు ఒలింపిక్ కాంస్య పతకాలు అందించిన శ్రీజేష్ జూనియర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టును విజయపథంలో నడిపాడు.
జూనియర్ వరల్డ్ కప్లో కాంస్యం సహా శ్రీజేష్ పర్యవేక్షణలో జట్టు ఆడిన ప్రతి టోర్నీలోనూ పోడియంపైకి రావడం విశేషం. అయితే, గత డిసెంబర్తో ముగిసిన శ్రీజేష్ కాంట్రాక్టును రెన్యువల్ చేయని హెచ్ఐ భారత సీనియర్ జట్టు హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ సూచన మేరకు జూనియర్ జట్టుకు కూడా విదేశీ కోచ్ ఉండాలని భావిస్తోంది. ఫ్రాన్స్కు చెందిన ఐమెరిక్ బెర్మాంగోను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై శ్రీజేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘జట్టు ప్రదర్శన బాలేనప్పుడు కోచ్ను మారుస్తారు. కానీ, వరల్డ్ కప్ పతకం అందించినా విదేశీ కోచ్ కోసం నన్ను తప్పించడం ఎంతవరకు సమంజసం? సీనియర్, జూనియర్ కోచ్ల మధ్య సమన్వయం కోసం విదేశీ కోచ్ కావాలని చెబుతున్నారు. ఒక భారత కోచ్తో ఫుల్టన్ ఎందుకు సమన్వయం చేసుకోలేడు?’ అని శ్రీజేష్ ప్రశ్నల వర్షం కురిపించాడు. హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ మినహా ఫెడరేషన్లోని అధికారులంతా స్వదేశీ కోచ్నే కోరుకుంటున్నారని తెలిపాడు.
ఇక, మార్చి 7న కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో జరిగిన సమావేశాన్ని శ్రీజేష్ గుర్తు చేసుకున్నాడు. ‘2036 ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకుని జట్టును నడిపించేందుకు నాలాంటి కోచ్లు కావాలని మంత్రి చెప్పారు. కానీ హాకీ ఇండియా మాత్రం విదేశీయులనే నమ్ముకుంటోంది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కంటే రాబోయే విదేశీ కోచ్ ఏ విధంగా మెరుగో నిరూపించాలని శ్రీజేష్ డిమాండ్ చేశాడు.