గతేడాది బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత జట్టు.. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటై.. సంప్రదాయ క్రికెట్లో తమ అత్యల్ప స్కోరు నమోదు చేసుకుంది.ఇంకేముంది సిరీస్ అప్పగించేయడం ఖాయమే అనుకుంటున్న సమయంలో.. తిరిగి పుంజుకున్న టీమ్ఇండియా మెల్బోర్న్, బ్రిస్బేన్లో చక్కటి విజయాలు సాధించి 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది!
తాజాగా ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన కోహ్లీసేన దాదాపు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. లార్డ్స్ టెస్టులో అద్భుత విజయంతో జోరుమీదున్న భారత్.. ఆ వెంటనే లీడ్స్లో జరిగిన మూడో టెస్టులో 78 పరుగులకే ఆలౌటైంది. ఇక కోలుకోవడం కష్టమే అనుకుంటున్న తరుణంలో ఓవల్లో జరిగిన నాలుగో టెస్టులో తొలుత పట్టు కోల్పోయినా..ఆఖర్లో విజృంభించిన టీమ్ఇండియా అద్భుత విజయంతో సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. హార్ కర్ జీత్నే వాలేకో బాజీగర్ కహ్తే హై (ఓడి గెలిచేవాడినే మాయగాడు అంటారు) అనే బాలీవుడ్ డైలాగ్ను గుర్తు చేస్తూ టీమ్ఇండియా సాగిస్తున్న జైత్రయాత్రపై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ‘ప్రస్తుత క్రికెట్లో ఇతర జట్లన్నీ టీమ్ఇండియాను ఓడించాలనుకుంటున్నాయి’ఓవల్ టెస్టు ఆరంభానికి ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న మాటలివి. అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న భారత్ను ఓడిస్తే వచ్చే కిక్కే వేరు అనేది కోహ్లీ మాటల అంతరార్థం. విదేశీ పిచ్లపై భారత్కు వరుస పరాజయాలు ఎదురవడం మామూలే అనే స్థాయి నుంచి.. ‘కోహ్లీ సేన పనిపట్టాలి’అని ప్రత్యర్థులంతా పంతాలకు దిగేస్థాయికి చేరడంతోనే టీమ్ఇండియా ఒక మెట్టు ఎక్కేసింది. అయితే ఈ విజయాలకు జట్టులో ఏ ఒక్క ఆటగాడో కారణం కాకుండా.. సమిష్టి కృషితో ముందుకు సాగడం భారత క్రికెట్కు సానుకూలాంశం. ఒకప్పుడు వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లలా.. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ మైదానంలో దూసుకెళ్తున్న టీమ్ఇండియా.. ఓవల్లో అద్భుతమే చేసింది.
కష్టానికి ప్రతిఫలం..
నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ప్రారంభానికి ముందు ఇరు జట్లకు సమాన అవకాశాలు కనిపించాయి. పిచ్, వాతావరణం కోణంలో చూస్తే.. ఇంగ్లండ్ వైపే మొగ్గు ఎక్కువనిపించింది. పొడిబారిన పిచ్ నుంచి బౌలర్లకు ఏ మాత్రం సహకారం లభించకపోగా.. అత్యుత్తమ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో లేకపోవడం టీమ్ఇండియాను దెబ్బకొడుతుందా అనిపించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే మన బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇంగ్లిష్ జట్టు వంద పరుగులు జోడించే వరకు ఒక్క వికెట్ తీయలేకపోయిన మనవాళ్లు.. ఆ తర్వాత 110 పరుగుల వ్యవధిలో పది మందిని పెవిలియన్ చేర్చారు. బర్న్స్ వికెట్తో శార్దూల్ ఇంగ్లండ్ పతనానికి శ్రీకారం చుట్టగా.. రెండో సెషన్లో బుమ్రా, జడేజా 6 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ నడ్డి విరిచారు.
రియల్ హీరో శార్దూల్..
రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన హిట్మ్యాన్ రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’దక్కినా.. ఈ అవార్డుకు అసలైన అర్హుడు మాత్రం నయా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూరే! తొలి ఇన్నింగ్స్లో భారత్ 127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులో నిలిచిన శార్దూల్.. ప్రత్యర్థిపై దండయాత్రకు దిగాడు. బౌలర్తో సంబంధం లేకుండా ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ.. క్రీజులో కుదురుకుంటే ఓవల్లో బ్యాటింగ్ చేయడం పెద్ద కష్టం కాదని నిరూపించాడు. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన ఈ ఆల్రౌండర్ టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్లో జోష్ నింపాడు. ఫలితంగా మన బౌలర్లు ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో బాగానే కట్టడి చేయగలిగారు. ఒక దశలో రూట్ సేన 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో భారత్కు ఆధిక్యం దక్కుతుందని భావించినా.. ఓలీపోప్, క్రిస్ వోక్స్ అర్ధశతకాలతో రాణించి ఇంగ్లండ్కు ఆధిక్యం అందించారు. మ్యాచ్పై ఇంగ్లిష్ జట్టు పట్టు సాధిస్తున్న సమయంలో బంతి చేతబట్టిన శార్దూల్.. కీలకమైన పోప్ను ఔట్ చేసి టీమ్ఇండియాకు ఇతోధిక సాయం చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శతక్కొట్టినా.. ఆఖర్లో ఆధిక్యం అందించింది మాత్రం ఠాకూరే. 72 బంతుల్లోనే 60 పరుగులు చేయడంతో కోహ్లీసేన ప్రత్యర్థికి మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. టార్గెట్ ఛేజింగ్లో దూసుకెళ్తున్న ఇంగ్లండ్ ఓపెనర్ల ముందరి కాళ్లకు బంధం వేస్తూ బర్న్స్ను ఔట్ చేసిన శార్దూల్.. క్రీజులో పాతుకుపోయిన జో రూట్ను పెవిలియన్ బాట పట్టించి టీమ్ఇండియా విజయాన్ని ఖాయం చేశాడు. అందుకే ఆట అనంతరం ‘ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూరే అసలైన హీరో’అని రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా కితాబిచ్చారు.