న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడాలని భారత్కు చెందిన ఓ వ్యాపారవేత్త తనను బెదిరించాడని జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ విషయమై సోమవారం సోషల్ మీడియాలో టేలర్ ఒక ప్రకటన విడుదల చేశాడు. ‘జింబాబ్వేలో టీ20 లీగ్ను ప్రారంభించేందుకు 2019లో ఓ భారత వ్యాపారవేత్త నన్ను సంప్రదించాడు. అతడి ఆహ్వానం మేరకు ఇండియాకు వచ్చా. ఓ హోటల్లో ఏర్పాటు చేసిన పార్టీలో మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వీడియోను తీసి బెదిరించడం మొదలుపెట్టారు. అప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడాలని.. 15,000 అమెరికా డాలర్లు ఆఫర్ చేశాడు.నేను అంగీకరించకపోయేసరికి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డాడు. భారత్ నుంచి తిరిగి వెళ్లేందుకు అప్పుడు డబ్బులు తీసుకున్నా. రెండేండ్లుగా ఈ భారాన్ని మోయలేక మానసికంగా కృంగిపోయిన నేను అందుకే ఈ ప్రకటన విడుదల చేస్తున్నా’ అని టేలర్ ప్రకటించాడు. అయితే ఆ వ్యాపారవేత్త ఎవరో.. ఏ మ్యాచ్లో ఫిక్సింగ్కు పాల్పడాలని చెప్పాడో తదితర విషయాలను టేలర్ బహిర్గతపరచలేదు. జింబాబ్వే తరఫున 34 టెస్టులు, 205 వన్డేలు, 45 టీ20లు ఆడిన టేలర్ 2021 సెప్టెంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.