Paris Olympics : నిరుడు ఆసియా క్రీడల్లో పతకాలతో చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్లు(Indian Athletes) ప్యారిస్ ఒలింపిక్స్ (Paris Olympics)లోనూ అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఒలింపిక్స్ పోటీలకు ఆరు నెలలు మాత్రమే ఉండడంతో విదేశాల్లో శిక్షణ తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. అందుకు భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన స్కీపుల్ ఛేజ్ రన్నర్లు అవినాష్ సబ్లే(Avinash Sable), పరుల్ చౌదరీ(Parul Choudhury)లు అమెరికాలోని కొలరాడోలో ట్రైనింగ్ తీసుకోనున్నారు.
రెజ్లర్లు అన్షు మాలిక్(Anshu Malik) జపాన్లో, సరితా మోర్(Sarita More) అమెరికాలోని ఒలిపింక్ ట్రైనింగ్ కేంద్రంలో తర్ఫీదు పొందనున్నారు. టేబుల్ టెన్నిస్ ఆటగాడు పయాస్ జైన్(Payas Jain) జపాన్లోని ఒసాకాలో కోచ్ కీ జియాన్ పర్యవేక్షణలో రాటుదేలనున్నాడు. అంతేకాదు పారా అథ్లెట్లు శీతల్ దేవి, సరితా, రాకేశ్ కుమార్లకు ఆర్థిక సాయం అందించేందుకు క్రీడా శాఖ అంగీకరించింది. కాంపౌండ్ విల్లు, బాణాలు, సైట్ స్కేల్స్.. తదితర సామగ్రిని టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం కింద మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.
పరుల్ చౌదరీ, హాకీ జట్టు, నీరజ్ చోప్రా
చైనా ఆతిథ్యమిచ్చిన 19వ ఆసియా గేమ్స్లో భారత అథ్లెట్లు పోటాపోటీగా పతకాలు కొల్లగొట్టారు. షూటింగ్, ఆర్చరీ, స్టీపుల్ ఛేజ్తో పాటు జావెలిన్ త్రోలో పసిడి వెలుగులు విరజిమ్మారు. దాంతో, భారత బృందం గత రికార్డులను బద్ధలు కొడుతూ 107 మెడల్స్ సాధించింది. అనంతరం జరిగిన ఆసియా పారా గేమ్స్(Asia Para Games)లోనూ మన అథ్లెట్లు 111 పతకాలతో రికార్డు నెలకొల్పారు. జూలై 26వ తేదీన ప్యారిస్లో మొదలవ్వనున్న ఒలింపిక్స్ పోటీలు ఆగస్టు 11వ తేదీన ముగుస్తాయి.