అంటిగ్వా: గత ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకునేందుకు యువ భారత్ సమాయత్తమవుతున్నది. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్తో యంగ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచిన యువ భారత్.. పాంచ్ పటాకా మోగించాలని కృతనిశ్చయంతో ఉంది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లో తిరుగులేని విజయాలు సాధించిన యంగ్ ఇండియా.. అదే ఊపులో బంగ్లాను చిత్తు చేసి సెమీస్కు దూసుకెళ్లాలని భావిస్తున్నది. కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆరుగురు ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. యంగ్ ఇండియా హ్యాట్రిక్ విజయం నమోదు చేసి ఫుల్ జోష్లో ఉంది. కొవిడ్-19 నుంచి కోలుకున్న కెప్టెన్ యష్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగనుండటం టీమ్ఇండియాకు కలిసిరానుంది.
కొవిడ్ నుంచి కోలుకొని
టోర్నీ తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన యంగ్ఇండియాకు కరోనా గట్టి దెబ్బకొట్టింది. వైరస్ బారినపడి కెప్టెన్ యష్తో పాటు తెలుగు ఆటగాడైన వైస్ కెప్టెన్ రషీద్ లీగ్ మ్యాచ్లకు దూరమైనా.. పరిమిత వనరులతోనే బరిలోకి దిగిన భారత జట్టు అద్వితీయ ప్రదర్శనతో వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ‘ఆటగాళ్లంతా కోలుకున్నారు. బంగ్లాతో పోరులో వీళ్లంతా బరిలోకి దిగడం దాదాపు ఖాయమే’అని బీసీసీఐ అధికారి తెలిపారు.