చాన్నాళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దుమ్మురేపడంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ జయకేతనం ఎగరవేసింది. నాలుగో రోజు కాస్త పోరాడిన ఆతిథ్య జట్టు.. ఆదివారం ఆఖరి రోజు మిగిలిన నాలుగు వికెట్లను గంటలోపే కోల్పోయింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా.. రెండో టెస్టు వరకు హిట్మ్యాన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నట్లు సమచారం.
టెస్టు జట్టుకు దూరమైనా.. ఆటకు ఎప్పుడూ దూరం కాలేదు. ఈ క్రమంలో పరిమిత ఓవర్ల క్రికెట్తో పాటు ఐపీఎల్ ఆడా. రిథమ్ కోల్పోకుండా ఉండేందుకు కుకుబుర్రా బంతితో నిరంతరం ప్రాక్టీస్ కొనసాగించా. దూకుడుగా బౌలింగ్ చేయడం ద్వారా వికెట్లు పడగొట్టొచ్చని బలంగా నమ్మా. దాన్నే మ్యాచ్లో ఆచరణలో పెట్టా.
-కుల్దీప్ యాదవ్
చటోగ్రామ్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత క్రికెట్ జట్టు.. బంగ్లాదేశ్పై భారీ విజయం నమోదు చేసుకుంది. 513 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 324 పరుగుల వద్ద ఆలౌటైంది. జాకిర్ హసన్ (100) సెంచరీ నమోదు చేయగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (84; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) పోరాడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 4 వికెట్లు పడగొట్టారు. ఓవర్నైట్ స్కోరు 272/6తో ఆదివారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా.. మరో 11.2 ఓవర్లలో మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ (13)ను హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఔట్ చేయగా.. కుల్దీప్ వరుస ఓవర్లలో షకీబ్, ఇబాదత్ (0) పనిపట్టాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టడంతో పాటు తొలి ఇన్నింగ్స్లో 40 పరుగులు చేసిన కుల్దీప్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 404 ( పుజారా 90, శ్రేయస్ 86; మెహదీ 4/112, తైజుల్ 4/133), బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 150 (ముష్పికర్ 28; కుల్దీప్ 5/40, సిరాజ్ 3/20), భారత్ రెండో ఇన్నింగ్స్: 258/2 డిక్లేర్డ్ (గిల్ 110, పుజారా 102 నాటౌట్; ఖాలెద్ 1/51), బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 324 (జాకిర్ 100, షకీబ్ 84; అక్షర్ 4/77, కుల్దీప్ 3/73).