వెయిట్ లిఫ్టింగ్ హెవీ వెయిట్ విభాగంలో భారత్కు తొలి పతకం దక్కింది. ప్లస్ 109 కేజీల ఈవెంట్లో గుర్దీప్ సింగ్ కాంస్యం గెలుచుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోటీల్లో గుర్దీప్ 390 కేజీల బరువెత్తి కంచు మోత మోగించాడు. స్నాచ్లో 167 కేజీలెత్తిన గుర్దీప్.. క్లీన్ అండ్ జర్క్లో 223 కేజీలు ఎత్తాడు. క్లీన్ అండ్ జర్క్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన గుర్దీప్.. ఈక్రమంలో జాతీయ రికార్డును తిరగరాశాడు. మణికట్టు గాయం వల్ల స్నాచ్లో వంద శాతం ప్రదర్శన కనబర్చలేకపోయానని..
లేకపోతే దేశానికి కనీసం రజతం అందించేవాడినని పోటీ అనంతరం గుర్దీప్ అన్నాడు. ఈ విభాగంలో పాకిస్థాన్కు చెందిన మహమ్మద్ నూహ్ భట్ 405 కేజీలు (173+232) స్వర్ణం చేజిక్కించుకోగా.. న్యూజిలాండ్ లిఫ్టర్ డేవిడ్ ఆండ్రూ 394 (170+224) రజతం నెగ్గాడు. భారత అభిమానుల నుంచి తనకు విశేష మద్దతు లభించిందని నూహ్ భట్ పేర్కొన్నాడు. ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను తన రోల్ మోడల్ అని తెలిపాడు.