ఆర్హుస్: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్లో క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. తొలి పోరులో స్పెయిన్పై నెగ్గిన మన అమ్మాయిలు మంగళవారం రెండో మ్యాచ్లో 4-1తో స్కాట్లాండ్ను చిత్తు చేశారు. గ్రూప్-బిలో భాగంగా జరిగిన ‘టై’ సింగిల్స్ తొలి మ్యాచ్లో మాళవిక ఓటమి పాలవగా.. ఆ తర్వాత అదితి, తస్నీమ్ విజయాలు సాధించారు. డబుల్స్లో తనీషా-రుతుపర్ణ, త్రిశ-గాయత్రి గోపీచంద్ జోడీలు గెలుపొందాయి. మాళవిక 13-21, 9-21తో గిల్మోర్ చేతిలో పరాజయం పాలవగా.. అదితి భట్ 21-14, 21-8తో రాచెల్పై నెగ్గింది. డబుల్స్ పోరులో తనీషా-రుతుపర్ణ జంట 21-11, 21-8తో జూలీ-కియారా ద్వయంపై గెలువగా.. తదుపరి సింగిల్స్ మ్యాచ్లో తస్నీమ్ 21-15, 21-6తో లారెన్పై గెలుపొందింది. అప్పటికే భారత్ విజయం ఖాయం అయిపోగా.. ఆఖరి పోరులో త్రిశ-గాయత్రి గోపీచంద్ జోడీ 21-8, 19-21, 21-10తో క్రిస్టీ-ఎలానర్ ద్వయంపై గెలిచింది. స్పెయిన్తో పోరులో గాయం కారణంగా అర్ధాంతరంగా మైదానాన్ని వీడిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.. ఈ మ్యాచ్లో బరిలోకి దిగకున్నా యువ షట్లర్లు దుమ్మురేపారు. బుధవారం జరుగనున్న చివరి లీగ్ మ్యాచ్లో థాయ్లాండ్తో భారత్ తలపడుతుంది.