IND vs BAN |సుదీర్ఘ విరామం అనంతరం బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు.. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. మొదట స్పిన్నర్లు రాణించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేస్తే.. ఆనక కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ హరికేన్ ఇన్నింగ్స్తో విరుచుకుపడింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన తన వంతు బాధ్యత నిర్వర్తించగా.. ఈ మ్యాచ్తో తెలుగమ్మాయి అనూష అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.
మీర్పూర్: నాలుగు నెలల అనంతరం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మీర్పూర్ స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి టీ20లో హర్మన్ప్రీత్ బృందం 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. షొర్నా అక్తర్ (28 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. శథి రాణి (22), శోభన (23) రాణించారు. భారత బౌలర్లలో పూజ వస్ర్తాకర్, మిన్ను మని, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ 16.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 118 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. మరో సీనియర్ ప్లేయర్ స్మృతి మందన (38; 5 ఫోర్లు) ధాటిగా ఆడింది. విధ్వంసక ఓపెనర్ షఫాలీ వర్మ (0), జెమీమా రోడ్రిగ్స్ (11) విపలమయ్యారు. దీంతో ఒక దశలో భారత్ 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. అయినా లక్ష్యం పెద్దది కాకపోవడంతో మరో ఓపెనర్ స్మృతి మందనతో కలిసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ హర్మన్ప్రీత్ కౌర్ జట్టును విజయతీరాలకు చేర్చింది.
తెలుగమ్మాయి అరంగేట్రం..
ఈ మ్యాచ్ ద్వారా తెలుగమ్మాయి బారెడ్డి అనూష అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అనంతపురంలో పుట్టిన అనూష ఆంధ్ర జట్టు తరఫున నిలకడైన ప్రదర్శన చేస్తుండటంతో సెలెక్టర్లు బంగ్లా టూర్కు ఆమెను ఎంపిక చేశారు. తొలి మ్యాచ్లోనే బరిలోకి దిగిన అనూష తన లెఫ్టార్మ్ బౌలింగ్తో ఆకట్టుకుంది. వికెట్ పడగొట్టలేకపోయినా.. తన కోటా 4 ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులే ఇచ్చింది.