పరుగుల వరద పారిన పోరులో రోహిత్ సేనదే పైచేయి అయింది. ‘360 డిగ్రీస్ ప్లేయర్’ అనే పేరుకు తగ్గట్లు సూర్యకుమార్ యాదవ్.. సఫారీ బౌలర్లను ఊచకోత కోయగా.. వంతులు వేసుకున్నట్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దంచికొట్టారు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ తన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో టీమ్ ఇండియా భారీ స్కోరు చేయగా.. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది.
ఆరంభంలో మన బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కనీసం పోటీనివ్వలేక పోయిన సఫారీ టీమ్ ఆఖర్లో సత్తాచాటింది. పిడుగుల్లాంటి షాట్లతో మిల్లర్ భయపెట్టినా.. వరుసగా రెండో మ్యాచ్లో విజయంతో రోహిత్ సేన సిరీస్ పట్టేసింది.
దక్షిణాఫ్రికా విజయానికి 12 బంతుల్లో 63 పరుగులు అవసరమైన దశలో మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్స్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మొత్తంగా 458 రన్స్ నమోదైన మ్యాచ్లో రెండు జట్లు కలిపి 65 (40 ఫోర్లు, 25 సిక్సర్లు) బౌండ్రీలు కొట్టడం గమనార్హం!
గువాహటి: పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో టీమ్ఇండియా దుమ్మురేపింది. ఇటీవలే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ చేజిక్కించుకున్న రోహిత్ సేన.. దక్షిణాఫ్రికాపై కూడా సేమ్ సీన్ రిపీట్ చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ 16 పరుగుల తేడాతో జయకేతనం ఎగరవేసి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ (22 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టాడు. విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (43; 7 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (7 బంతుల్లో 17 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. గతంలో ఇక్కడ జరుగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. తాజా పోరులో గువాహటి అభిమానులు బౌండ్రీల జడివానలో తడిసి ముద్దయ్యారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో సఫారీ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డ దక్షిణాఫ్రికా చివర్లో ఎంత ప్రయత్నించినా విజయానికి చేరువ కాలేకపోయింది. డేవిడ్ మిల్లర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగినా ఫలితం లేకపోయింది. డికాక్ (48 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అర్శ్దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి మూడు ఓవర్లలో కలిపి 36 పరుగులిచ్చిన అర్శ్దీప్ 19వ ఓవర్లో ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. రాహుల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇండోర్లో నామమాత్రమైన మూడో టీ20 జరుగనుంది.
స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీమ్ఇండియా టీ20 సిరీస్ చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి.
భారత్: 20 ఓవర్లలో 237/3 (సూర్యకుమార్ 61, రాహుల్ 57, కోహ్లీ 49 నాటౌట్; కేశవ్ 2/23),
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 221/3 ( మిల్లర్ 106*, డికాక్ 69*; అర్శ్దీప్ 2/62).