న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగనున్న మ్యాచ్లో టీమ్ఇండియాపైనే ఒత్తిడి అధికంగా ఉండనుందని.. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. వచ్చే నెల 14న దాయాదుల మధ్య అహ్మదాబాద్ వేదికగా మెగా సమరం జరుగనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అక్తర్ మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్లో పాకిస్థాన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై అశేష ప్రేక్షకుల మధ్య ఆడనున్న టీమ్ఇండియాపైనే ఆ భారం ఎక్కువుంటుంది. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ జట్టే మెరుగైన ప్రదర్శన చేస్తుంది. రెండేండ్లుగా భారత్ తుది జట్టు స్థిరంగా లేదు. అదే సమయంలో బాబర్ ఆజమ్ సారథ్యంలో పాకిస్థాన్ ఎన్నో రెట్లు మెరుగైంది’ అని అక్తర్ అన్నాడు.