అద్వితీయ ప్రదర్శనతో ఇంగ్లండ్ను మట్టికరిపించిన భారత మహిళల జట్టు.. ఆస్ట్రేలియాపై కూడా అదే జోరు కొనసాగిస్తున్నది. ఏకైక టెస్టులో కట్టుదిట్టమైన బౌలింగ్తో కంగారూలను కట్టడి చేసిన టీమ్ఇండియా.. బ్యాటింగ్లోనూ అదరగొట్టింది.
ముంబై: సుదీర్ఘ ఫార్మాట్లో భారత మహిళల జట్టు దుమ్మురేపుతున్నది. ఇటీవల ఇంగ్లండ్పై ఘన విజయం సాధించిన టీమ్ఇండియా.. గురువారం ఆస్ట్రేలియాతో ప్రారంభమైన ఏకైక టెస్టులో శుభారంభం చేసింది. బౌలర్లు సమిష్టిగా కదంతొక్కడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 219 పరుగులకు ఆలౌటైంది. తహిలా మెక్గ్రాత్ (50), బెత్ మూనీ (40), అలీసా హీలీ (38) రాణించారు. భారత బౌలర్లలో పూజ వస్ర్తాకర్ (4/53), స్నేహ్ రాణా(3/56) విజృంభించారు. ముఖ్యంగా పూజ పదునైన పేస్తో కంగారూ బ్యాటర్ల భరతం పట్టింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హర్మన్ప్రీత్ బృందం తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (40; 8 ఫోర్లు), స్మృతి మందన (43 నాటౌట్; 8 ఫోర్లు) సత్తాచాటారు. చేతిలో 9 వికెట్లు ఉన్న టీమ్ఇండియా.. ప్రత్యర్థి స్కోరు కంటే 121 పరుగులు వెనుకబడి ఉంది. స్మృతితో పాటు స్నేహ్ రాణా క్రీజులో ఉంది.