3 అరంగేట్ర టెస్టులో 150 పైచిలుకు పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు. ధవన్ (187), రోహిత్ (177) ముందున్నారు.
ఫ్లాట్పిచ్పై భారత బ్యాటర్లు దుమ్మురేపారు. అరంగేట్ర మ్యాచ్లోనే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ సెంచరీతో కదంతొక్కితే.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వికెట్లు తీసేందుకు నానా తంటాలు పడ్డ వెస్టిండీస్ బౌలర్లకు.. 271 పరుగుల ఆధిక్యం సాధించిన అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి రోహిత్ చల్లని కబురు చెప్పాడు. టీ విరామానికే రెండు వికెట్లు కోల్పోయిన కరీబియన్ జట్టు ఏమాత్రం పోరాడుతుందో చూడాలి!
డొమినికా: నిర్జీవంగా మారిన పిచ్పై ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టిన భారత జట్టు.. భారీ ఆధిక్యం సాధించిన అనంతరం తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో దాదాపు రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 421/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ స్కోరు 312/2తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన రోహిత్ సేన్.. మరో 109 పరుగులు జోడించి.. ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. దీంతో భారత్కు 271 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. 143 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. 387 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 171 పరుగుల చేసి వెనుదిరిగాడు. తద్వారా అరంగేట్ర టెస్టులోనే 150 పైచిలుకు పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (182 బంతుల్లో 76; 5 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న తొలి మ్యాచ్లోనే డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన యశస్విని.. అల్జారీ జోసెఫ్ ఔట్ చేశాడు. కాసేపటికే వైస్ కెప్టెన్ అజింక్యా రహానే (3) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లీకి జడేజా చక్కటి సహకారం అదించాడు. వీరిద్దరూ నింపాదిగా ఆడుతూ.. మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించారు. తన స్వభావానికి విరుద్ధంగా మరీ నెమ్మదిగా ఆడినా కోహ్లీ.. ఒక దశలో సెంచరీ చేయడం ఖాయమే అనుకుంటే.. చివరకు మహాబలుడు కార్న్వాల్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.
రవీంద్ర జడేజాతో పాటు.. తొలి టెస్టు ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ క్రీజులో ఉండగా.. బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న అశ్విన్, శార్దూల్ క్రీజులోకి రావాల్సి ఉండటంతో భారత్ మరికాసేపు బ్యాటింగ్ చేస్తుందనుకున్నా.. రోహిత్ రెండో సెషన్లోనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ టీ విరామానికి రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.