భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా క్రికెట్ అభిమానులకు బీసీసీఐ ప్రత్యేక మ్యాచ్ను అందించబోతోంది. 90వ దశకంలో ప్రపంచ క్రికెట్ను ఏలిన దిగ్గజాలతో మ్యాచ్ నిర్వహించనున్నది. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బీసీసీఐ.. ఇండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్తో ప్రత్యేక మ్యాచ్ను నిర్వహించతలపెట్టింది. వచ్చే నెల 15 నుంచి మొదలుకానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) ఈ మ్యాచ్తోనే ప్రారంభంకానున్నది. సెప్టెంబర్ 15న ఈడెన్ గార్డెన్ (కోల్కతా) వేదికగా బీసీసీఐ ఈ మ్యాచ్ను నిర్వహించనున్నది.
ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం భారత జట్టుకు ‘ఇండియా మహారాజాస్’అని రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టుకు ‘వరల్డ్ జెయింట్స్’గా పేరు పెట్టారు. ఇండియా మహారాజాస్కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సారథ్యం వహించనుండగా.. వరల్డ్ జెయింట్స్కు ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్గా ఉండనున్నాడు.
ఈ మేరకు ఇరు జట్లలో ఆడబోయే సభ్యులను కూడా ప్రకటించారు. దాదా జట్టులో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, శ్రీశాంత్, ఆర్పీసింగ్ వంటి వాళ్లకు చోటు దక్కింది. ఇక ఇయాన్ మోర్గాన్ జట్టులో హర్షల్ గిబ్స్, సనత్ జయసూర్య, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, బ్రెట్ లీ వంటి దిగ్గజాలున్నారు.
జట్ల వివరాలు :
ఇండియా మహరాజాస్ జట్టు: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసఫ్ పఠాన్, ఎస్. బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్ (వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, ఎస్. శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా (వికెట్ కీపర్), అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగీందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి.
వరల్డ్ జెయింట్స్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండిల్ సిమన్స్, హర్షల్ గిబ్స్, జాక్వస్ కలిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్ (వికెట్ కీపర్), నాథన్ మెక్కల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హోమిల్టన్ మసకజ్ద, మష్రాఫి మోర్తజా, అస్గర్ అఫ్గాన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒబ్రెయిన్, దినేశ్ రామ్దిన్ (వికెట్ కీపర్)