మెల్బోర్న్: ఈ ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్థాన్(Ind Vs Pak) మ్యాచ్ జరిగేది డౌట్గానే ఉంది. టీ20 వరల్డ్కప్లో ఇండియా తన తొలి ఎన్కౌంటర్లో పాకిస్థాన్తో మెల్బోర్న్ లో తలపడనున్నది. అయితే ఆ మ్యాచ్ జరిగే అవకాశాలు శూన్యంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వారం మొత్తం వర్షాలు ఉన్నట్లు ఆస్ట్రేలియా వెదర్ డిపార్ట్మెంట్ తన రిపోర్ట్లో తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని అంచనా వేస్తే.. ఆదివారం జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్ రద్దు అవ్వడం ఖాయంగా తోస్తోంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వ వాతావరణ శాఖ ప్రకారం.. ఆదివారం రోజున మెల్బోర్న్లో సుమారు 80 శాతం వర్షం పడే అవకాశం ఉంది. అది కూడా ఆ రోజున సాయంత్రం తప్పకుండా వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. బ్యూరో ఆఫ్ మెటరాలజీ వెబ్సైట్ ప్రకారం వచ్చే ఆదివారం మెల్బోర్న్ ఎక్కువ శాతం మేఘావృతమై ఉంటుంది. జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఆ సైట్లో వర్ష సూచన చేశారు. సాయంత్రంపూట 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెదర్ శాఖ పేర్కొన్నది.
కేవలం ఆదివారం మాత్రమే కాదు.. శుక్ర, శని వారాల్లోనూ 95 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. ఇండో పాక్ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం ఏకధాటిగా కురిస్తే, అప్పుడు మ్యాచ్ లేనట్లే అవుతుంది. సెమీస్, ఫైనల్స్కు మాత్రం రిజర్వ్ డేను కల్పించారు. ఇవాళ బ్రిస్బేన్లో కివీస్తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయిన విషయం తెలిసిందే.