T20 worldcup | గంపెడు ఆశలతో మెగాటోర్నీలో అడుగుపెట్టిన టీమ్ఇండియాకు.. తొలి మ్యాచ్లోనే ఊహించని షాక్ ఎదురైంది. విశ్వవేదికపై తొలిసారి దాయాది పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైన కోహ్లీసేన.. ఆ ఓటమిని పక్కనపెట్టి మలి పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్లో పూర్తిగా విఫలమై చిరకాల ప్రత్యర్థికి అంతులేని ఆత్మవిశ్వాసాన్ని అందించిన టీమ్ఇండియా.. నేడు న్యూజిలాండ్తో తాడో పేడో తేల్చుకోనుంది. సెమీస్ దారిలో సజావుగా సాగాలంటే భారత్కు గెలుపు అత్యవసరం కాగా.. అదే ప్రత్యర్థి చేతిలో దెబ్బ తిన్న కివీస్ ప్రపంచకప్లో బోణీ కొట్టాలని తహతహలాడుతున్నది!
దుబాయ్: ఒకే ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైన రెండు మేటి జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయ్యాయి. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమ్ఇండియాను తొలి మ్యాచ్లోనే నేలకు దించిన పాకిస్థాన్.. న్యూజిలాండ్కు కూడా ఓటమి రుచిచూపింది. గత మ్యాచ్ పరాజయాన్ని పక్కనపెట్టి గెలుపు బాట పట్టాలని ఉవ్విళ్లూరుతున్న సమ ఉజ్జీలైన రెండు జట్ల మధ్య నేడు ఆసక్తికర పోరు ఖాయంగా కనిపిస్తున్నది. ఐసీసీ టోర్నీల్లో భారత్ పై మెరుగైన రికార్డు ఉన్న న్యూజిలాండ్ మరోసారి కోహ్లీసేనను చిత్తు చేయాలని పథకాలు రచిస్తుంటే.. దెబ్బతిన్న పులి పంజా పవర్ చాటాలని టీమ్ఇండియా ఎదురుచూస్తున్నది.
మూడేసి మ్యాచ్లు ఆడేసిన ఇతర జట్లతో పోలిస్తే.. మలి మ్యాచ్కు సిద్ధమయ్యేందుకు కోహ్లీసేనకు కావాల్సినంత సమయం దక్కింది. ఈ గ్యాప్లో లోపాలను సవరించుకున్న టీమ్ఇండియా సమిష్టిగా సత్తాచాటాలని చూస్తున్నది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నెట్స్లో బౌలింగ్ చేయడం టీమ్కు కలిసొచ్చే అంశం కాగా.. గత మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్కు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి.
పేపర్పై చూసుకుంటే కోహ్లీసేనదే పైచేయిలా కనిపిస్తున్నా.. ఒత్తిడిని జయించడంలో ఘనాపాటులైన విలియమ్సన్ అండ్ కోతో జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశాలున్నాయి. షాహీన్ అఫ్రిదిలా.. స్వింగ్తో టీమ్ఇండియా టాపార్డర్ను కూల్చేందుకు ప్రయత్నిస్తానని ఇప్పటికే కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ హెచ్చరికలు జారీ చేయగా.. క్వార్టర్ ఫైనల్లాంటి కీలక పోరులో టాపార్డర్ రాణించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. సూపర్-12 గ్రూప్-2లో పాకిస్థాన్ ఇప్పటికే మూడు మ్యాచ్లు నెగ్గి 6 పాయింట్లతో టాప్లో నిలువగా.. గ్రూప్ నుంచి ఇంకో జట్టుకు మాత్రమే సెమీస్ చేరే అవకాశాలున్న నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ ఈ పోరులో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి.
బయట ఏం జరుగుతుందో మాకు అవసరం లేదు. క్రికెటర్లపై ట్రోల్స్ చేయడం సరదాగా మారింది. అయినా మేం వాటిని పట్టించుకోం. కప్పు కొట్టేందుకే ఇక్కడికి వచ్చాం. ముఖ్యమైన మ్యాచ్లంటూ ఏమీ ఉండవు. అన్నీ గెలువాల్సిందే. తదుపరి మ్యాచ్లో ఒకటి, రెండు ఓవర్లు బౌలింగ్ చేసేందుకు పాండ్యా సిద్ధంగా ఉన్నాడు.
దుబాయ్ పిచ్ ఆరంభంలో స్వింగ్కు.. ఆ తర్వాత స్పిన్కు అనుకూలించే అవకాశాలున్నాయి. మంచు ప్రభావం ఉండనుండటంతో మరోసారి టాస్ కీలకం కానుంది. తేమ కారణంగా రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ చేయడమే సులువు.
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, సూర్య, పంత్, హార్దిక్, జడేజా, వరుణ్, శార్దూల్/భువనేశ్వర్, షమీ, బుమ్రా.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మిషెల్, కాన్వే, సీఫర్ట్, నీషమ్, ఫిలిప్స్, శాంట్నర్, సోధి, బోల్ట్, సౌథీ.