నాటింగ్హామ్: పేస్కు సహకరిస్తున్న పిచ్పై భారత బౌలర్లు విజృంభించడంతో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 183 పరుగులకు ఆలౌటైంది. జస్ప్రీత్ బుమ్రా (4/46), మహమ్మద్ షమీ (3/28) ఆతిథ్య బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించగా.. శార్దూల్ ఠాకూర్ (2/41), హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ (1/48) వారికి సహకరించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీసేన బుధవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమ్ఇండియా.. ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 162 పరుగులు వెనుకబడి ఉంది. రోహిత్ శర్మ (9), కేఎల్ రాహుల్ (9) క్రీజులో ఉన్నారు.
138/3 నుంచి.. 183/10కు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ ఐదో బంతికే బర్న్స్(0)ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. సిబ్లే (18), క్రాలీ (27) పోరాటంతో ఆతిథ్య జట్టు కోలుకుంది. వీరిద్దరూ వెనుదిరిగాక.. బెయిర్స్టోతో కలిసి రూట్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఫలితంగా ఒక దశలో ఇంగ్లండ్ 138/3తో మెరుగైన దశలో కనిపించింది. అయితే లంచ్కు ముందు చివరి బంతికి బెయిర్స్టోను ఔట్ చేసిన షమీ.. అదే ఓవర్లో లారెన్స్ను బలి తీసుకున్నాడు. అక్కడి నుంచి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడింది. బట్లర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. రాబిన్సన్ (0), బ్రాడ్ (4), అండర్సన్ (1) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సామ్ కరన్ (27 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ఆఖర్లో విలువైన పరుగులు జోడించాడు. 45 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ చివరి 7 వికెట్లు కోల్పోయిందంటే భారత బౌలర్ల హవా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 183 (రూట్ 64, బెయిర్స్టో 29; బుమ్రా 4/46, షమీ 3/28), భారత్: 21/0 (రోహిత్ 9 నాటౌట్, రాహుల్ 9 నాటౌట్).