Ind Vs Eng Test | హిమాలయ పర్వత సానువుల్లో భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్నట్లు శ్వేత వర్ణంలో మెరిసిపోతున్న పర్వతాల మధ్య రెండు అత్యుత్తమ జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే సిరీస్ దక్కించుకున్న టీమ్ఇండియా 4-1 లక్ష్యంగా బరిలోకి దిగుతుంటే..బజ్బాల్ను నమ్ముకున్న ఇంగ్లిష్ టీమ్ కనీసం పరువైనా దక్కించుకోవాలని తహతహలాడుతున్నది. రాంచీలోనే సిరీస్ను ఒడిసిపట్టుకున్న రోహిత్సేన.. ధర్మశాలలో ఇంగ్లండ్పై దరువు వేయాలని చూస్తున్నది.. మిగతా వేదికలకు భిన్నంగా కనిపిస్తున్న ధర్మశాల..ఆతిథ్య టీమ్కు అనుకూలిస్తుందా లేక ఇంగ్లండ్కు అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ మ్యాచ్ ద్వారా అశ్విన్, బెయిర్స్టో వందో టెస్టు మార్క్ను అందుకోబోతున్నారు. మొత్తంగా రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే ఆస్కారం ఉంది.
ధర్మశాల: భారత్, ఇంగ్లండ్ ఐదో టెస్టు పోరుకు సిద్ధమయ్యాయి. ధర్మశాల వేదికగా గురువారం నుంచి ఇరు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు కదనోత్సాహంతో కనిపిస్తున్నాయి. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 3-1ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా..ధర్మశాలపై జెండా ఎగురవేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. రాంచీ టెస్టు విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్సేన..ఐదో పోరులోనూ అదే దూకుడు కనబరిచేందుకు పట్టుదలతో ఉంది. మరోవైపు బజ్బాల్ను నమ్ముకుంటూ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన బెన్స్టోక్స్ సేన..హైదరాబాద్ టెస్టు మినహాయిస్తే..వరుసగా మూడు టెస్టుల్లో ఓటమిపాలై సిరీస్ చేజార్చుకుంది. మిగతా వేదికల్లో పిచ్లతో పోలిస్తే..భిన్నంగా కనిపిస్తున్న ధర్మశాలలో భారత్కు దీటైన పోటీనిచ్చేందుకు ఇంగ్లిష్ టీమ్ తహతహలాడుతున్నది. ప్రస్తుత ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్లో నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్న టీమ్ఇండియా.. ఐదో మ్యాచ్ గెలిచి తమ ర్యాంకింగ్ను మెరుగుపర్చుకునేందుకు చూస్తున్నది. మరోవైపు వరుస ఓటములతో కుదేలవుతున్న ఇంగ్లండ్.. బజ్బాల్ ప్రయోగం తర్వాత తొలి టెస్టు సిరీస్ను కోల్పోయిన అపప్రదను మూటగట్టుకుంది.
ఇంగ్లండ్తో ఐదో పోరుకు భారత్ మార్పులు, చేర్పులతో బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్ట్రైక్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి రానుండగా, యువ బౌలర్ ఆకాశ్దీప్సింగ్ను కొనసాగించాలా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఒకవేళ పిచ్ పేస్కు అనుకూలించే అవకాశాలు కనిపిస్తే..బుమ్రా, సిరాజ్తో ఆకాశ్దీప్ తుది జట్టులో ఉండే అవకాశముంది. ఇదే జరిగితే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్యాదవ్ తన స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్తో టీమ్ఇండియా పోటీకి దిగవచ్చు. బ్యాటింగ్ విషయానికొస్తే..యువ బ్యాటర్ రజత్ పాటిదార్ వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటున్నాడు. ఆడిన మూడు టెస్టుల్లో 63 పరుగులతో నిరాశపరిచాడు. పాటిదార్ను తిరిగి కొనసాగిస్తారా లేక దేవదత్ పడిక్కల్కు చాన్స్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. వికెట్కీపర్, బ్యాటర్ ధృవ్ జురెల్ అంచనాలకు మించి అదరగొడుతుండగా, సర్ఫరాజ్ఖాన్ రాంచీ టెస్టులో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గైర్హాజరీలో యువ క్రికెటర్లు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పట్టుదలతో ఉన్నారు. ఈ మ్యాచ్ ద్వారా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ వంద మ్యాచ్ల క్లబ్లో చేరబోతున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ టీమ్ ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్కు పోటీనివ్వబోతున్నది. బెయిర్స్టో ఈ మ్యాచ్ ద్వారా వంద మ్యాచ్ల మైలురాయిని అందుకోబోతున్నాడు.
2 టెస్టుల్లో 700 వికెట్ల ఫీట్ను అందుకునేందుకు ఇంగ్లండ్ సీనియర్ పేసర్ అండర్సన్కు కావాల్సిన వికెట్లు
8 టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్లో చేరేందుకు జడేజా ఎనిమిది వికెట్ల దూరంలో ఉన్నాడు.
100 ధర్మశాల టెస్టు ద్వారా అశ్విన్, బెయిర్స్టో 100 మ్యాచ్ల మైలురాయిని అందుకోబోతున్నారు.
భారత్: రోహిత్శర్మ(కెప్టెన్), జైస్వాల్, గిల్, పాటిదార్, జడేజా, సర్ఫరాజ్ఖాన్, జురెల్, అశ్విన్, కుల్దీప్యాదవ్-ఆకాశ్దీప్, సిరాజ్, బుమ్రా
ఇంగ్లండ్: క్రాలే, డకెట్, పోప్, రూట్, బెయిర్స్టో, స్టోక్స్(కెప్టెన్), ఫోక్స్, హార్ట్లే, వుడ్, బషీర్, అండర్సన్.