పొట్టి పోరు ముగిసింది, వన్డే వార్కు వేళయైంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఓవల్ వేదికగా నేడు తొలి మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఓవైపు టీ20 సిరీస్ గెలుపు జోరును టీమ్ఇండియా కొనసాగించాలని చూస్తుంటే..సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం కోసం ఇంగ్లండ్ ఎదురుచూస్తున్నది. కోహ్లీ ఫామ్ కలవరపెడుతున్నా…తనదైన రోజున ప్రత్యర్థి భరతం పడుతాడని మేనేజ్మెంట్ గంపెడు ఆశలు పెట్టుకున్నది. స్టోక్స్, రూట్,బెయిర్స్టో రాకతో ఇంగ్లండ్ బలం పుంజుకున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే ఆస్కారముంది.
లండన్: ప్రపంచంలో రెండు అత్యుత్తమ జట్ల మధ్య వన్డే పోరుకు సమయం ఆసన్నమైంది. మంగళవారం ఓవల్ మైదానం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. టీ20లకు కొనసాగింపుగా వన్డేల్లోనూ సత్తాచాటాలని రోహిత్శర్మ నేతృత్వంలోని టీమ్ఇండియా పట్టుదలతో కనిపిస్తున్నది. సీనియర్ బ్యాటర్ శిఖర్ ధవన్ తిరిగి జట్టుకు ఎంపిక కాగా, కెప్టెన్ రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. ఆప్షనల్ ప్రాక్టీస్లో భాగంగా ధవన్, ఇషాన్ కిషన్ నెట్ ప్రాక్టీస్లో పాల్గొనగా, మిగతావారు దూరంగా ఉన్నారు.
సీనియర్ బ్యాటర్ కోహ్లీ ఫామ్లేమి మేనేజ్మెంట్ను ఇబ్బందులకు గురిచేస్తున్నది. గత కొంత కాలంగా విరాట్ పరుగులు సాధించడంలో ఘోరంగా విఫలమవుతూ విమర్శలకు గురువుతున్నాడు. టీ20ల్లో రాణించకపోయినా..వన్డేల్లోనైనా సత్తాచాటుతానన్న నమ్మకంతో ఉన్నాడు. బౌలింగ్ దళానికి షమీ, బుమ్రా నాయకత్వం వహించనున్నారు. సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాలి.
స్టోక్స్, రూట్, బెయిర్స్టో ఆగయా:
స్టార్ త్రయం స్టోక్స్, రూట్; బెయిర్స్టో రాక ఇంగ్లండ్ జట్టులో కొత్త ఉత్తేజాన్ని నింపునుంది. భారత్తో ఆఖరి టెస్టులో అదరగొట్టిన ఈ ముగ్గురు టీమ్ఇండియాపై విజృంభించాలని చూస్తున్నారు. మోర్గాన్ నుంచి పగ్గాలు అందుకున్న తర్వాత తొలిసారి బట్లర్ వన్డేల్లో నాయకత్వం వహిస్తున్నాడు.
వన్డే షెడ్యూల్
తొలి వన్డే జూలై 12
రెండో వన్డే జూలై 14
మూడో వన్డే జూలై 17