హార్సెన్స్: ప్రతిష్టాత్మక థామస్ కప్లో రెండో టైటిల్ వేటలో ఉన్న భారత బ్యాడ్మింటన్ జట్టు శుక్రవారం క్వార్టర్స్లో చైనీస్ తైపీతో తలపడనుంది. నాలుగేండ్ల క్రితం ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. తాజా ఎడిషన్లో గ్రూప్-ఏలో కెనడా, ఆస్ట్రేలియాపై భారీ విజయాలు సాధించి చైనా చేతిలో పోరాడి ఓడింది. గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన భారత్.. గ్రూప్-సీలో అగ్రస్థానం దక్కించుకున్న చైనీస్ తైపీతో అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పటిష్టంగానే కనిపిస్తున్న భారత్కు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. తైవాన్ నుంచి ప్రపంచ ఆరో నంబర్ చౌ టైన్ చెన్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ విజేత లిన్ చున్ యితో పాటు 21వ ర్యాంకర్ చి యు జెన్ సింగిల్స్ విభాగాల్లో జోరుమీదున్నారు. వీరిని భారత షట్లర్లు ఏ మేరకు నియంత్రించగలరన్నది ప్రశ్నార్థకం! మరి భారత్ క్వార్టర్స్ గండాన్ని అధిగమించి టైటిల్ దిశగా సాగుతుందా? లేదా? అన్నది నేడు తేలనుంది.