మెకాయ్: వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. మూడు వన్డేలు, ఒక టెస్టు (డే అండ్ నైట్), 3 టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన మిథాలీ రాజ్ నేతృత్వంలోని బృందం.. మంగళవారం మెకాయ్ వేదికగా తొలి వన్డే బరిలో దిగనుంది. గాయం కారణంగా హర్మన్ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోగా.. కెప్టెన్ మిథాలీపై అదనపు భారం పడనుంది. బ్యాటింగ్లో స్మృతి మందన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మిథాలీ కీలకం కానుండగా.. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి బౌలింగ్ దళాన్ని ముందుకు నడిపించనుంది. టీనేజ్ సంచలనం షఫాలీ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే మెరుపులు మెరిపించగా.. ఇటీవల జరిగిన హండ్రెడ్ టోర్నీలో జెమీమా రోడ్రిగ్స్ దుమ్మురేపి మంచి ఫామ్లో ఉంది. మరోవైపు వరుసగా 22 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్న ఆసీస్ జట్టు.. టీమ్ఇండియాపై కూడా తమ జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ సమరం జరుగడం ఖాయంగా కనిపిస్తుండగా.. దీప్తి శర్మ, పూనమ్ రౌత్, స్నేహ్ రాణా వంటి యువ ప్లేయర్లు కంగారూ గడ్డపై సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు.