ముంబై: సొంతగడ్డపై ఇంగ్లండ్ను మట్టికరిపించి.. రికార్డు విజయం ఖాతాలో వేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్ధమైంది. గురువారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా ఏకైక టెస్టు జరగనుంది. ఇప్పటి వరకు సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాపై విజయం సాధించలేదు. 46 ఏండ్లలో ఇరు జట్ల మధ్య 10 టెస్టులు జరగగా.. ఇప్పటి వరకు టీమ్ఇండియా బోణీ కొట్టలేకపోయింది. ప్రస్తుతం మంచి జోష్లో ఉన్న భారత్.. ఆసీస్పై కూడా నయా చరిత్ర లిఖించాలని భావిస్తున్నది.
కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు స్మృతి మంధన, షఫాలీ వర్మ, జెమీమా రో డ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా సమిష్టిగా రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన కంగారూ పేసర్ మిషెల్ స్టార్క్ భార్య అలీసా హీలీ సారథ్యంలో ఆసీస్ జట్టు పటిష్టంగా కనిపిస్తున్నది. మూనీ, పెర్రీ, తహిలా మెక్గ్రాత్, గార్డ్నర్, అనాబెల్, అలానా కింగ్, జెస్ జాన్సన్తో కూడిన ఆస్ట్రేలియాను అడ్డుకోవాలంటే మనవాళ్లు శక్తికి మించి పోరాడాల్సిందే.