IND vs AUS: వన్డే ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు భారత్లో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్నది. నవంబర్ 23 నుంచి మొదలుకాబోయే ఈ సిరీస్లో ఆఖరి మ్యాచ్ డిసెంబర్ 3న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం (ఉప్పల్)లో జరగాల్సి ఉంది. అయితే భాగ్యనగరంలో ఈ మ్యాచ్ జరిగేది అనుమానంగానే ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదే రోజున వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్కు భద్రత కల్పించలేమని చెప్పినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వర్గాలు తెలిపాయి.
పోలీసులంతా అక్కడే..
తెలంగాణలో ఇప్పటికే అపెంబ్లీ ఎన్నికల నోటీఫికేషన్ విడుదలకాగా అధికార భారత రాష్ట్ర సమితితో పాటు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో నవంబర్ 30న ఓటింగ్ జరగాల్సి ఉండగా డిసెంబర్ 03న ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది. ఎన్నికలు ముగిశాక ఈవీఎంలతో పాటు ఓటింగ్ మిషనరీ మొత్తం పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. ఫలితాలు వెలువడే రోజు రాష్ట్రంలోని ఎన్నికల కౌంటింగ్ ప్రాంతాల్లో సెక్షన్ 144 కూడా విధించే అవకాశాలుంటాయి. దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా కౌంటింగ్ కేంద్రాల వద్దే పహారా కాయనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్లో అదే రోజు జరుగబోయే మ్యాచ్కు తాము భద్రత కల్పించబోమని పోలీసులు హెచ్సీఏకు తెలిపినట్టు సమాచారం.
నిర్వహణ కష్టమే..
ఇటీవలే హెచ్సీఏలో కొత్త కార్యవర్గం ఎన్నికకాగా అపెక్స్ కౌన్సిల్లో కూడా ఈ విషయంపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఇక్కడ మ్యాచ్ నిర్వహణ కష్టంతో కూడుకున్న వ్యవహారమని హెచ్సీఏ భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్లో భాగంగా సెప్టెంబర్ 29న ఇదే ఉప్పల్లో జరిగిన న్యూజిలాండ్ – పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంలో కూడా పోలీసులు ఈ మ్యాచ్కు భద్రతను కల్పించలేదు. సరిగ్గా అదే రోజు నగరంలో గణేష్ నిమజ్జనంతో పాటు మిలాద్ ఉన్ నబీ పండుగల నేపథ్యంలో హెచ్సీఏ ఈ మ్యాచ్ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించింది.
షెడ్యూల్ మార్చండి..!
తాజా సమాచారం ప్రకారం.. హెచ్సీఏ కూడా ఈ మ్యాచ్ షెడ్యూల్ను మార్చాలని బీసీసీఐని కోరినట్టు తెలుస్తున్నది. నవంబర్ 23న వైజాగ్లో జరగాల్సి ఉన్న మ్యాచ్ను హైదరాబాద్కు తరలించి.. డిసెంబర్ 3న హైదరాబాద్లో జరగాల్సిన మ్యాచ్ను వైజాగ్కు తరలించాలని కోరినట్టు సమాచారం.