IND vs AUS | సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న టీమ్ఇండియా.. మరో పోరుకు రెడీ అయింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో భారీ విజయాన్నందుకున్న రోహిత్ సేన.. అదే జోరులో రెండో టెస్టు చేజిక్కించుకోవాలని చూస్తున్నది. టాపార్డర్ హోరు, స్పిన్నర్ల జోరు, ఆల్రౌండర్ల తోడుతో భారత జట్టు శత్రు దుర్భేద్యంగా కనిపిస్తుంటే.. స్పిన్ ఉచ్చును ఛేదించేందుకు కంగారూలు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు. వందో టెస్టు ఆడుతున్న పుజారా దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని చూస్తుంటే.. ఢిల్లీ పిచ్పై ఢంకా బజాయించేందుకు కోహ్లీ సిద్ధమయ్యాడు.
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత జట్టు.. నేటి నుంచి ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో అమీతుమీ తేల్చుకోనుంది. నాలుగు మ్యాచ్ల ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్లో తొలి టెస్టు (నాగ్పూర్) నెగ్గి ఉత్సాహంగా ఉన్న రోహిత్సేన.. ఢిల్లీలోనూ దంచికొట్టి సిరీస్లో పైచేయి సాధించాలని చూస్తున్నది. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్లో విజయాలు సాధించిన టీమ్ఇండియా ఇక్కడ కూడా అదే జోరు కొనసాగిస్తుంటే.. భారత స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకొని కంగారూలు విలవిలలాడుతున్నారు.
నయావాల్ చతేశ్వర్ పుజారాకు ఇది వందో టెస్టు కావడం విశేషం. 2010లో తొలి టెస్టు ఆడిన పుజారా 13 ఏండ్ల కెరీర్లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్లతో జట్టుకు మరపురాని విజయాలు అందించాడు. ఇప్పటి వరకు 19 టెస్టు సెంచరీలు తన పేరిట లిఖించుకున్న పుజ్జీ.. మైలురాయి మ్యాచ్లో 20వ శతకం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. కేఎల్ రాహుల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నా.. అతడి స్థానానికొచ్చిన ఇబ్బందేం లేదు. గాయం కారణంగా గత మ్యాచ్కు అందుబాటులో లేని శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో సూర్యకుమార్ యాదవ్కు ఈసారి చోటు దక్కకపోవచ్చు. రోహిత్, రాహుల్ ఓపెనింగ్ చేయనుండగా.. ఆ తర్వాత వరుసగా చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ బ్యాటింగ్కు రానున్నారు.
మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్తో పాటు ముగ్గురు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ అందుబాటులో ఉన్నారు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, షమీ పేస్ భారాన్ని మోయనున్నారు. గత మ్యాచ్లో నాయకుడిగా తొలి టెస్టు సెంచరీ నమోదు చేసుకున్న రోహిత్ అదే ఫామ్ కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. ఇక నాగ్పూర్ తరహాలోనే స్పిన్కు సహకరించనున్న పిచ్పై భారత త్రయంతో ఆసీస్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆత్మవిశ్వాస లోపంతో కనిపిస్తున్నది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుండగా.. మిగిలిన బ్యాటర్లు కూడా సమిష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది.
1987 నుంచి ఈ వేదికపై భారత జట్టు టెస్టు మ్యాచ్ ఓడిపోలేదు.
మరో వికెట్ పడగొడితే రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో 250 వికెట్లు పూర్తి చేసుకుంటాడు.
కెరీర్ ప్రారంభించినప్పుడు ఇక్కడి వరకు వస్తానని అనుకోలేదు. వర్తమాన అంశాలనే పట్టించుకుంటా.. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించను.వందో టెస్టు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధిస్తామని ఆశిస్తున్నా. టీమ్ఇండియా తరఫున డబ్ల్యూటీసీ టైటిల్ సాధించాలనేదే నా అతిపెద్ద కల. క్రితం సారితుది పోరులో ఓడిపోయాం.. ఈ సారి అలాకాకుండా చూసుకుంటాం.
– చతేశ్వర్ పుజారా
పిచ్, వాతావరణం
ఢిల్లీ వికెట్ స్పిన్కు సహకరించనుంది. పేసర్లకు కాస్త బౌన్స్ లభించే అవకాశం ఉంది. మ్యాచ్కు వర్షం ముప్పులేదు.