న్యూఢిల్లీ: భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వ పటిమకు తగిన గుర్తింపు లభించింది. అరంగేట్రం సీజన్లోనే గుజరాత్ టైటాన్స్కు ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలకంగా వ్యవహరించిన పాండ్యా టీమ్ఇండియా కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఐర్లాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్కు ఎంపికైన ప్లేయర్లనే దాదాపుగా కొనసాగిస్తూ కొన్ని మార్పులు చేసింది. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన మహారాష్ట్ర బ్యాటర్ రాహుల్ త్రిపాఠి తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది.
ఈమధ్యే ఐపీఎల్ 15వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ను ఫైనల్ పోరులో నిలిపిన వికెట్కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్కు సెలెక్టర్లు మరోమారు అవకాశమిచ్చారు. సఫారీలతో పొట్టి ఫార్మాట్లో రిషబ్ పంత్కు ప్రస్తుతం డిప్యూటీగా వ్యహరిస్తున్న హార్దిక్ పాండ్యా..ఐర్లాండ్తో సిరీస్లో పూర్తి స్థాయి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. తనదైన నాయకత్వ శైలితో గుజరాత్ను ముందుండి నడిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న పాండ్యా..భారత భవిష్యత్ కెప్టెన్గా మన్ననలు అందుకున్నాడు. అయితే ఐర్లాండ్తో సిరీస్ జరిగే సమయంలోనే భారత్..ఇంగ్లండ్ పర్యటనలో ఆడనుంది.
ఈ క్రమంలో ద్వితీయ శ్రేణి జట్టు పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, దినేశ్ కార్తీక్ కీపర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. తొలిసారి జట్టుకు ఎంపిక కావడంపై రాహుల్ త్రిపాఠి స్పందిస్తూ ‘సెలెక్టర్ల నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నాను. నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. తుది జట్టులో ఆడే అవకాశం లభిస్తే..కచ్చితంగా సత్తాచాటుతాను’ అని అన్నాడు. ఇషాన్ కిషన్, శాంసన్, కార్తీక్ రూపంలో జట్టుకు ముగ్గురు వికెట్కీపర్ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ దళాన్ని భువనేశ్వర్ ముందుకు నడిపించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
14 మందితో ఐర్లాండ్ జట్టు ఎంపిక
డబ్లిన్: భారత్తో జరుగనున్న రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ 14 మందితో జట్టును ప్రకటించింది. క్రికెట్ ఐర్లాండ్తో ఇటీవలే కాంట్రాక్ట్ కుదుర్చుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్లు స్టీఫెన్ డోహ్నె, కానర్ ఒల్ఫెర్ట్ కొత్తగా జట్టుకు ఎంపికయ్యారు. దేశవాళీ క్రికెట్లో ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని సెలెక్టర్లు ఈ ఇద్దరికీ అవకాశం కల్పించారు.
ఐర్లాండ్ టీమ్: బాల్బిర్నె(కెప్టెన్), మార్క్ అదియర్, కాంపెర్, డెల్నె, జార్జ్ డాక్రెల్, డోహ్నె, జోష్ లిటిల్, మెక్బ్రైన్, మెక్కార్తీ, ఒల్ఫెర్ట్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టకర్, క్రెగ్ యంగ్.
భారత జట్టు: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, అవేశ్ఖాన్, అర్ష్దీప్సింగ్, ఉమ్రాన్ మాలిక్