ఢాకా: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత పురుషుల హాకీ జట్టు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా లీగ్ దశను ముగించింది. ఇప్పటికే సెమీఫైనల్కు అర్హత సాధించిన భారత్.. ఆదివారం జరిగిన రౌండ్ రాబిన్ చివరి లీగ్ మ్యాచ్లో 6-0తో జపాన్ను చిత్తు చేసింది. భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (10వ, 53వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో మెరువగా.. దిల్ప్రీత్ సింగ్ (23వ), జర్మన్ప్రీత్ (34వ), సుమిత్ (46వ), శంషేర్ సింగ్ (54వ) ఒక్కో గోల్ నమోదు చేశారు. ప్రత్యర్థి జట్టు ఎంత ప్రయత్నించినా.. భారత రక్షణ శ్రేణిని దాటి ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. ఈ విజయంతో భారత్ 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలువగా.. కొరియా (6), జపాన్ (5), పాకిస్థాన్ (5) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మంగళవారం జరుగునున్న సెమీఫైనల్లో జపాన్తోనే భారత్ తలపడనున్నది.
హర్మన్ ధమాకా
మ్యాచ్ ఆరంభం నుంచి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని మన్ప్రీత్ సింగ్ సేన.. బంతిని ఎక్కువ శాతం తమ ఆధినంలోనే ఉంచుకుంది. తొలి ఆరు నిమిషాల్లోనే భారత్కు రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా వాటిని మనవాళ్లు వినియోగించుకోలేకపోయారు. ఈ క్రమంలో 10వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్ను డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ప్రీత్ గోల్ పోస్ట్లోకి పంపడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత దిల్ప్రీత్, జర్మన్ప్రీత్, సుమిత్, శంషేర్ ఒక్కో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం పెరుగుతూ పోయింది. హర్మన్ప్రీత్ మరో పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో ఓవరాల్గా భారత్ సిక్సర్ కొట్టింది. అటాకింగ్లోనే కాకుండా.. డిఫెన్స్లోనూ మనవాళ్లు పూర్తి ఆధిపత్యం కనబర్చారు. నిర్ణీత 60 నిమిషాల్లో ప్రత్యర్థికి ఐదుసార్లు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా.. అందులో ఒక్క గోల్ కూడా కాకుండా మన రక్షణ శ్రేణి గోల్ పోస్ట్ ముందు అడ్డుగోడలా నిలబడింది.